యూపీలో 29.92 లక్షల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం

యూపీలో 29.92 లక్షల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం
లక్నోలో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల  గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ద్వారా ఆ రాష్ట్రంలో 29.92 లక్షల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం అయింది. దీని కారణంగా 92.5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించుకునే అవకాశం దక్కింది.ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిధిగా హాజరై సందర్బంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
 
మరో ఐదేళ్లతో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలని పెట్టుకున్న లక్ష్యం చేరుకొనేందుకు అనువుగా యూపీని ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీ ఒక ఆశాకిరణంగా మారిందని పేర్కొంటూ నేడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని ప్రపంచంలోని ప్రతి విశ్వసనీయ స్వరం విశ్వసిస్తోందని ప్రధాని తెలిపారు.

ఒకప్పుడు యూపీని బీమారు రాష్ట్రం అని పిలిచేవారని, యూపీపై అందరూ ఆశలు వదులుకున్నారని చెప్పిన ప్రధాని మోదీ  గత 5-6 ఏళ్లలో యూపీ కొత్త గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. ఇప్పుడు యూపీ సుపరిపాలనకు గుర్తింపు తెచ్చుకుంటోందని, యూపీ నేడు కొత్త ఛాంపియన్‌గా అవతరిస్తోందని కొనియాడారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఇల బలమైన నెట్‌వర్క్ ఉందని చెబుతూ  యోగి ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశంసించారు.

ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక మొబైల్స్‌ తయారీ జరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో డైరీ వ్యవసాయం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. దేశంలో 5 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏకైక రాష్ట్రంగా అతి త్వరలో యూపీ గుర్తింపు పొందనుందని ప్రధాని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు, యుపిలో సులభతర వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఆలోచన, విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ యూపీ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధికి ముఖ ద్వారంగా అభివర్ణించిన యోగి యూపీలో పెట్టుబడుల కోసం 18,643 ఎంఓయూలపై సంతకాలు జరిగాయని చెప్పారు.

రూ.75,000 కోట్లు పెట్టుబడి ప్రకటించిన అంబానీ

 ఈ  సందర్భంగా పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ  రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను సృష్టించేందుకు, అదనంగా రూ.75,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.  జియో, రీటైల్‌, రెన్యూవల్‌, రంగంలో ఈ ఉద్యోగాలు లభిస్తాయని అంబానీ ప్రకటించారు.

ఈ మెగా పెట్టుబడుల నిర్ణయం ద్వారా రానున్న కాలంలో ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది.    యూపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నంలో చాలా మంది పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో రక్షణమంత్రి రాజనాథ్ సింగ్,  యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు.

.