సీఎం గత ఏడాది బడ్జెట్ చదవడంతో రసాభాసగా అసెంబ్లీ

రాజస్తాన్‌ అసెంబ్లీ శుక్రవారం గ‌తేడాది బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని ముఖ్యమంత్రి చదవడంతో రసాభాసగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష బిజెపి నిరసనలు వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి గెహ్లాట్‌ బడ్జెట్‌ను చదువుతుండగా.. అది పాత బడ్జెట్‌ అంటూ బిజెపి ఆరోపిస్తూ  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చివరకు మరోరోజు బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ప్రకటించి ముఖ్యమంత్రి సభను వాయిదా వేశారు. బడ్జెట్ పత్రాలు లీకయ్యాయని ఆరోపిస్తూ ప్రతిపక్ష బీజేపీ సభ్యులు బడ్జెట్ ప్రసంగంపై అభ్యంతరాలు తెలియజేయడంతో సభ రెండు సార్లు వాయిదా పడింది.

ముఖ్యమంత్రి తప్ప మరెవరూ బడ్జెట్‌ కాపీని పొందకూడదని, అయితే బ్జెట్‌ కాపీని కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హడావిడీ చేయడంతో నలుగురైదుగురు చేతుల్లోకి మారిందని బిజెపి ఛబ్రా ఎమ్మెల్యే గులాబ్‌ చంద్‌ కటారియా, బిజెపి నేత ప్రతాప్‌ సింగ్‌ సంఘ్వీలు ఆరోపించారు. బడ్జెట్‌ లీకైందని, ముఖ్యమంత్రి కొత్త బడ్జెట్‌ను తీసుకురావాలని డిమాడ్‌ చేశారు.

సభ తిరిగి ప్రారంభం కాగానే .. ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి గెహ్లాట్‌ తోసిపుచ్చారు. బడ్జెట్‌ లీక్‌ కాలేదని, గతేడాది బడ్జెట్‌కు చెందిన అదనపు పేజీ సూచనల కోసం తాజా బడ్జెట్‌ పత్రాలలో చేర్చారని తెలిపారు. బిజెపి ఆరోపణలపై గెహ్లాట్‌ విరుచుకుపడ్డారు. పొదుపు, ఉపశమనం, పురోగతి ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ థీమ్‌ అని, అది బిజెపికి అడ్డంకిగా మారిందని విమర్శించారు.

అయితే మొదట అశోక్‌ గెహ్లాట్‌ 2023-24 బడ్జెట్‌కు బదులుగా పట్టణ ఉపాధి, కృషి బడ్జెట్‌పై మునుపటి బడ్జెట్‌ను చదివారు. గతేడాది బడ్జెట్‌లో రెండు ప్రకటనలు చేసిన వెంటనే .. బిజెపి సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. ఈ ఏడాది చివరలో  అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇదే చివరి బడ్జెట్‌ కానుంది.

అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆయన గతేడాది బడ్జెట్ ప్రసంగంలోని కొన్ని భాగాలను చదవడంతో సభలో ఒక్కసారిగా కల్లోలం రేగింది. సీఎంకు వ్యతిరేకంగా ప్రతిపక్ష బీజేపీ పార్టీ సభ్యులు భారీ నిరసనకు తెరలేపారు. సభానిబంధనలు పాటించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో..సభను అరగంట పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.

దాంతో పొరపాటు జరిగిందని గుర్తించిన సీఎం గెహ్లాట్ సభకు క్షమాపణ చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలోని తొలి పేజీ మాత్రమే తప్పుగా ఉందని వివరించారు. ఈ క్రమంలో వారు స్పీకర్ ముందు వెల్‌లో కూర్చుని ధర్నాకు దిగారు. బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌రాదు అని, అది లీకైందని బిజెపి నేత గులాబ్ చాంద్ క‌టారియా స్పష్టం చేశారు.

గత ఏడాది బ‌డ్జెట్‌లోని ప‌ట్ట‌ణ ఉద్యోగ క‌ల్ప‌న‌, కృషి బ‌డ్జెట్ అంశాల‌పై సీఎం గెహ్లాట్ పాత లెక్క‌లు చ‌దివిన‌ట్లు బిజెపి ఆరోప‌ణ‌లు చేసింది. 8 నిమిషాల పాటు పాత బ‌డ్జెట్‌నే గెహ్లాట్ చ‌దివార‌ని మాజీ ముఖ్యమంత్రి వ‌సుంధ‌రా రాజే ఆరోపించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పలుమార్లు బడ్జెట్ ప్రసంగాన్ని చెక్ చేసుకునే దాన్ని అని చెబుతూ దీనిని బట్టి.. రాష్ట్ర భవిష్యత్తు సీఎం చేతుల్లో ఎంత భద్రంగా ఉందో ఊహించుకోవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

గతేడాది బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్న సీఎం గెహ్లాట్ వీడియోలను పలువురు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీజేపీ నేషనల్ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్యా ట్విట్టర్ వేదికగా అశోక్ గెహ్లాట్‌ను విమర్శించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి.. అందునా స్వయంగా ఆర్థికశాఖ మంత్రి అయ్యుండి కూడా గతేడాది బడ్జెట్ ప్రసంగాన్ని ఈ ఏడు సభలో మళ్లీ చదివారని ఎద్దేవా చేశారు.

చీఫ్ విప్ మధ్యలో కలుగజేసుకుని సీఎం ప్రసంగాన్ని ఆపాల్సి వచ్చిందని చెప్పారు. ఇది తలవంపులు తెచ్చే ఘటన అని పేర్కొంటూ ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో కాంగ్రెస్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ ఘటనతో బయటపడింది అంటూ ధ్వజమెత్తారు.