జీవో నంబర్‌ 1పై జోక్యంకు `సుప్రీం’ నిరాకరణ

జీవో నంబర్‌ 1పై జోక్యంకు `సుప్రీం’ నిరాకరణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 1పై సస్పెన్షన్ విధిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏపీ హైకోర్టులో కేసు విచారణ జరుగనున్న నేపథ్యంలో సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో జీవో నంబర్ 1 భవితవ్యం ఏపీ హైకోర్టులో తేలనుంది.

 జీవో నంబర్ 1 అమలును తాత్కలికంగా సస్పెండ్‌ చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఉత్వర్వులను సస్పెండ్ చేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

కేసు మెరిట్స్‌లోనికి వెళ్లకుండానే విచారణను కోర్టు వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో 23వ తేదీన విచారణ జరగాల్సి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులు కూడా అన్ని అంశాలను డివిజన్ బెంచ్‌ ముందు ప్రస్తావించవచ్చని సూచించింది.  రాష్ట్రంలోని రోడ్లపై బహిరంగ సభలు, సమావేశాల విషయంలో జారీ చేసిన జీవో 1 అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో ఏపీ హైకోర్టు తప్పు చేసిందని పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం జనవరి రెండో తేదీన జీవోను తీసుకొచ్చింది. రాజకీయ పార్టీల గొంతు నొక్కేందుకు జీవో తెచ్చారని ఆరోపిస్తూ, ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు