ఈ-కుంభ్‌ పోర్ట‌ల్‌ ప్రారంభించిన రాష్ట్ర‌ప‌తి ముర్ము

ఈ-కుంభ్‌ పోర్ట‌ల్‌ ప్రారంభించిన రాష్ట్ర‌ప‌తి ముర్ము

భువనేశ్వర్‌ లో ఈ-కుంభ్‌ పోర్ట‌ల్‌ నేడు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్రారంభించారు. ప్రాంతీయ భాష‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ సుమారు 12 భాష‌ల‌కు చెందిన పుస్త‌కాల‌ను ఆ సైట‌లో పొందుప‌రిచారు.  ఈ-కుంభ్‌  అన‌గా నాలెడ్జ్ అన్‌లీష్డ్ ఇన్ మ‌ల్టిపుల్ భార‌తీయ లాంగ్వేజెస్‌. ఈ వెబ్ పోర్ట‌ల్‌లో ఇంజినీరింగ్ పుస్త‌కాలు విద్యార్థుల‌కు అందుబాటులో ఉంటాయి. 

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫ‌ర్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ ఇంజనీరింగ్ పుస్త‌కాల‌ను ఒడియా భాష‌లో రాష్ట్ర‌ప‌తి ముర్ము విడుదల చేశారు. క‌మిష‌న్ ఫ‌ర్ సైంటిఫిక్ అండ్ టెక్నిక‌ల్ ట‌ర్మినాల‌జీ (సీఎస్టీటీ) ఒడియా భాష‌లో డెవ‌ల‌ప్ చేసిన సుమారు 50వేల టెక్నిక‌ల్ ట‌ర్మ్స్‌ను కూడా ఆ భాష సైట్‌లో పొందుప‌రిచారు.

సాంకేతిక విద్యను చాలామంది విద్యార్థులు ఆంగ్లంలో అర్ధం చేసుకోలేక పోతున్నారని చెబుతూ అందుకనే నూతన విద్యావిధానంలో మాతృభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యత ఇచ్చిన్నట్లు రాష్ట్రపతి తెలిపారు. మాతృభాషలో విద్యాబోధన విద్యార్థులలో ఆలోచన శక్తిని, సృజనాత్మకతను, మేధోసంపదను పెంపొందింప చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. పైగా, విద్యాబోధనలో గ్రామీణ, పట్టణ విద్యార్థులకు సమాన అవకాశాలు లభిస్తాయని ఆమె తెలిపారు. 

ప్రాంతీయ భాషలలో పాఠ్య గ్రంథాలు లభించడం ఒక సమస్యగా ఉండెడిది అంటూ ఒరియా భాషలో గల మహోత్తర భాషాసంపద కారణంగా అదొక్క సమస్యకాబోదని ముర్ము విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ విషయంపై వస్తే అన్ని భారతీయ భాషలు సమానంగా మంచి భాషాసంపద కలిగినవే అని ఆమె స్పష్టం చేశారు. 

ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ పుస్త‌కాల‌ను 12 భార‌తీయ భాష‌ల్లోకి త‌ర్జుమా చేసిన‌ట్లు మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ తెలిపారు. హిందీ, మ‌రాఠీ, బెంగాలీ, త‌మిళ్‌, తెలుగు, గుజ‌రాత్‌, క‌న్న‌డ‌, పంజాబీ, ఒడియా, అస్సామీ భాష‌ల్లో ఇంజినీరింగ్ పుస్త‌కాలు ట్రాన్స్‌లేట్ అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇక ఉర్దూ, మ‌ల‌యాళం భాష‌ల్లో త‌ర్జుమా ప‌ని జరుగుతోంద‌ని పేర్కొన్నారు. 

ఇంగ్లీష్ లేకుండా టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ అర్థ‌ర‌హితంగా ఉంటుంద‌ని చాలా మంది వాదిస్తార‌ని, కానీ ప్ర‌పంచాన్ని ఆర్థికంగా శాసిస్తున్న దేశాల్లో చైనా, జ‌ర్మ‌నీ, జ‌పాన్ ఉన్నాయ‌ని, ఆ దేశాలు ఏవీ ఇంగ్లీష్‌పై ఆధార‌ప‌డ‌వ‌ని, స్వంత భాష‌ల్లోనే ఆ దేశాల్లో పాఠ్య‌పుస్త‌కాలు ఉంటాయ‌ని మంత్రి తెలిపారు.