మద్యం మత్తులో తూలిపోతూ, ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నందుకు జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో విమానం ఎక్కిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ సిబ్బంది విమానం నుంచి దించివేశారని మీడియాలో వస్తోన్న కథనాలపై కేంద్రం విచారణకు పూనుకొంది. ఈ ఘటన తాలూకు వాస్తవాలను పరిశీలిస్తామని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.
ఘటనపై విచారణ జరపాలని కాంగ్రెస్ సహా పలు పార్టీలు సింధియాను డిమాండ్ చేయడంతో విచారణ చేయిస్తామని చెప్పారు. ఘటన విదేశీ గడ్డపై జరిగిందని తెలుస్తున్నందున పూర్తి వివరాలు అందించాలని ఆయన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ను కోరారు. లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ వివరాల కోసం ఎదురుచూస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఈ నెల 11 నుంచి 18 వరకూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ జర్మనీలో పర్యటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ వ్యాపారవేత్తలను కోరే లక్ష్యంతో ఆయన జర్మనీ వెళ్లారు. అయితే ఆయన షెడ్యూల్ ప్రకారం రావాల్సిన రోజు కాకుండా ఒక రోజు ఆలస్యంగా భారత్ వచ్చారు.
మాన్ ఆలస్యానికి అసలు కారణం మద్యం మత్తులో జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో విమానం ఎక్కడమేనని, తనను తాను అదుపుచేసుకోలేకపోతోన్న మాన్ను లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ సిబ్బంది విమానం నుంచి దించివేశారంటూ శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ట్వీట్ చేశారు.ఆ కారణంగా విమానం నాలుగు గంటలపాటు ఆలస్యంగా బయలు దేరవలసి వచ్చిన్నట్లు కూడా పేర్కొన్నారు.
దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మాన్ కారణంగా విమానం నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరిందని, దీనివల్ల ఢిల్లీలో జరుగుతున్న ఆప్ జాతీయ సదస్సుకు కూడా మాన్ హాజరు కాలేకపోయారని సుఖ్బీర్ ఆరోపించారు. మాన్ నిర్వాకం వల్ల ప్రపంచం ముందు పంజాబ్ పరువు పోయిందని సుఖ్బీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుఖ్బీర్ ట్వీట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీపై విరుచుకుపడింది. పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా కేంద్ర విమానాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాశారు. వెంటనే మాన్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
అయితే తమను బద్నాం చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. మరోవైపు జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ఈ అంశంపై వివరణ ఇస్తూ విమానం ఆలస్యమైన మాట నిజమేనని, అనుబంధ విమానం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని పేర్కొంది. అయితే, ప్రయాణికుల వ్యక్తిగత డేటాను పంచుకోలేమని తెలిపింది. ఈ నేపథ్యంలో స్వయంగా కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదేశించడంతో లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ పూర్తి వివరాలు అందించే అవకాశాలున్నాయి. అసలు జరిగిందేంటో తెలిసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
More Stories
అమిత్ షాకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం