100 రోజులు పూర్తి చేసిన సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది. గత ఏడాది ఆగస్టు 28న భాగ్యలక్ష్మీ అమ్మవారి పాదాల చెంత నుండి ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర 4 విడతలుగా కొనసాగింది. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో గురువారం జరగబోయే భారీ బహిరంగ సభతో 4 విడతల పాదయాత్ర పూర్తి కానుంది.
 
ఈ నేపథ్యంలో 100 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. 
మంగళవారం ఉదయం నుండి ఉప్పల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సంజయ్ సాయంత్రం నాగోల్ చేరుకోగానే బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు.  సంజయ్ 100 రోజుల కేక్ కట్ చేసి బెలూన్లను గాలిలోకి వదిలేశారు.
 
ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి, కర్మన్ ఘాట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డితోపాటు భారీ ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 రోజుల పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ ఇప్పటి వరకు దాదాపు 1238 కి.మీలు నడిచారు. 46 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రను పూర్తి చేశారు. 
 
తెలుగు రాష్ట్రాల చరిత్రలో అధికార పార్టీ సహా మరే రాజకీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో అతి తక్కువ సమయంలో అత్యధికంగా బహిరంగ సభలను విజయవంతంగా నిర్వహించారు.   పాదయాత్రలో భాగంగా విద్యార్ధి, నిరుద్యోగ, ఉద్యోగ, కార్మిక, కర్షక వర్గాలతోపాటు వివిధ చేతి వ్రుత్తులు, కుల సంఘాలతోపాటు పేద మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
 
భాగ్యనగర్ లో పాదయాత్ర మొదలు పెట్టిన సంజయ్ రజాకార్ల దాష్టికాలను వివరిస్తూనే గ్రేటర్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. రెండో విడత పాదయాత్రలో పాలమూరు ప్రజల ఎదుర్కొంటున్న తాగు, నీటి సమస్యలను, ఎడారిగా మారడానికి కారణాలను వివరించారు. 
 
మూడో విడత పాదయాత్రలో విప్లవాల ఖిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైన మూసీ కాలుష్యం, చేనేత సమస్యలు, రజాకార్ల దాష్టీకాలపై ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ చారిత్రాత్మక ప్రదేశాల గొప్ప తనాన్ని, నయీం దారుణాలను, ఆయన డైరీలో పేర్కొన్న అంశాలను ప్రజల ముందుంచడంలో  సఫలీక్రుతుడయ్యారు.
 
ప్రస్తుతం మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 4వ విడత పాదయాత్ర చేస్తున్న సంజయ్ నగర శివారు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన రోడ్లు, డ్రైనేజీ, పరిశ్రమల కాలుష్యం, డంపింగ్ యార్డు, భూ కబ్జాలు వంటి అంశాలతోపాటు ముంపు ప్రాంతాల ప్రజల బాధలను లోకానికి ఎలుగెత్తి చాటడంతో సఫలీక్రుతలయ్యారు. అదే సమయంలో తెలంగాణ విమోచన దినం ఆవశ్యకతను, తెలంగాణ జాతీయ సమైక్య దినోత్సవాల పేరుతో చరిత్రను తెరమరుగు చేసేందుకు టీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. 
 
ఇక పాలన విషయానికొస్తే టీఆర్ఎస్ వైఫల్యాలను అడుగడుగునా ఎండగడుతూ కేసీఆర్ కుటుంబ పాలన వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, నష్టాన్ని కళ్లకు కట్టినట్లు వివరించగలిగారు.  అదే సమయంలో తెలంగాణ అభివ్రుద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ్రుద్ధి సంక్షేమ పథకాలను, కేటాయించిన నిధుల వివరాలను గణాంకాలతో సహా వాస్తవాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.