వైజాగ్‌ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేస్తున్న కేంద్రం

 వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. భవన నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తయ్యిందని తెలిపారు. జోన్‌ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
రాజ్యసభలో సోమవారం కేంద్రీయ విశ్వ విద్యాలయాల చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా వైసీపీ సభ్యులు విజయసాయిరెడ్డి ఆడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను ఆమోదించినట్లు పేర్కొన్నారు. అంతకు ముందు బిల్లుపై విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రైల్వేకు సంబంధించి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై పలు సూచనలు, సలహాలు చేశారు.

ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. రైల్వే మంత్రిత్వశాఖ వద్ద మూడు సంవత్సరాలుగా డీపీఆర్‌ పెండింగ్‌లోనే ఉందని వివరించారు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ. 68 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయని గుర్తు చేశారు. 

ప్రతి రోజు 21వేల ట్రైన్లు నడుస్తున్నాయని, దేశంలో 7,350 రైల్వే స్టేషన్ల నుంచి ప్రతిరోజు 2.2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని  తెలిపారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి, రైల్వే మంత్రిని కోరారు.

దేశంలో మొత్తం 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదని చెప్పారు. దీంతో ఉద్యోగార్ధులు రైల్వే పరీక్షల కోసం పక్క రాష్ట్రంలో సికింద్రాబాద్ కు వెళ్లాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంటుకు డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాగన్లు అందుబాటులో లేకపోవడంతో బొగ్గు సరఫరాలో కృత్రిమ కొరత ఏర్పడుతోందని,  తద్వారా ఉత్పత్తి కుంటుపడుతోందని విజయసాయి రెడ్డి తెలిపారు. వ్యాగన్ల కొరత కారణంగా మహానది కోల్ ఫీల్డ్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు తగినంతగా బొగ్గు సరఫరా చేయలేకపోతున్నారని చెప్పారు.