ఉచిత పథకాలపై నిర్ణయం ఓటర్లదే

ఉచిత పథకాలపై నిర్ణయం ఓటర్లదే

ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలు సంబంధిత పార్టీకి చెందిన విధానపరమైన నిర్ణయాలేనని ఎన్నికల సంఘం(ఈసీ) తెలియజేసింది. ఆయా పథకాల అమలు సాధ్యాసాధ్యాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పట్ల వాటి ప్రభావంపై సంబంధిత రాష్ట్ర ఓటర్లే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. 

ఈ మేరకు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్‌ సమర్పించిం ది. ఎన్నికల్లో గెలిచిన పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు తీసుకొనే నిర్ణయాలు, రాష్ట్రాల విధానాలను తాము నియంత్రించలేమని స్పష్టం చేసింది. చట్టంలో మార్పులు చేయకుండా అలా చేయలేమని ఉద్ఘాటించింది.

రాజకీయ పార్టీల నిర్ణయాలు, విధానాల్లో జోక్యం చేసుకుంటే చట్టాన్ని అతిక్రమించినట్లే అవుతుందని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలంటూ 2016 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి 47 ప్రతిపాదనలు చేశామని ఎన్నికల సంఘం వివరించింది. 

పార్టీల రిజిస్ట్రేషన్, డీ–రిజిస్ట్రేషన్‌ను క్రమబద్ధం చేసేందుకు వీలుగా అవసరమైన ఉత్తర్వులు ఇవ్వాలంటూ కేంద్ర న్యాయ శాఖకు సిఫార్సు చేశామని తెలిపింది. ఓటర్లను మభ్యపెట్టేలా ఉచిత పథకాలను ప్రకటించే పార్టీల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ అశ్వినీకుమార్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా ఎన్నికల సంఘం అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

15 తర్వాత నేతల క్రిమినల్ కేసులపై విచారణ 
 
ఇలా ఉండగా, దేశంలోని  ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణపై సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15వ తేదీ తర్వాత వాదనలు వినేందుకు అంగీకరించింది సుప్రీంకోర్టు. ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల వ్యవహారంపై తక్షణమే వాదనలు వినాలన్న అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా అభ్యర్థనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
గత ఐదేళ్లుగా రాజకీయ నేతలపై రెండు వేలకుపైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. సంబంధిత వ్యాజ్యంపై తక్షణమే విచారణ జరపాలని కోరుతూ సీజేఐ  ధర్మాసనం ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా. ప్రజా ప్రతినిధులపై కేసుల వ్యవహారంలో విజయ్ హన్సారియా అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్నారు.