ఆఫ్ఘన్ నుంచి అప్రతిహతంగా కొనసాగుతన్న వలసలు 

ఆఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు కైవసం చేసుకున్నప్పటి నుండి ఆ దేశ ప్రజల వలసలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. తాలిబన్లు అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా . ఓవైపు అరాచక పరిపాలన భయాలు, ఇంకొకవైపు తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం పౌరులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. 

దాంతో కొత్త జీవితం కోసం, పిల్లాజెల్లతో కట్టుబట్టలతో దేశం విడిచివెళ్తున్నారు. ఈ క్రమంలో సరిహద్దులు దాటేందుకు అనివార్య పరిస్థితులలో చట్టవిరుద్ధ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. మానవ అక్రమరవాణా దారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. సరిహద్దులు దాటించేందుకు సహకరిస్తున్నారు. తాలిబన్‌ ప్రభుత్వంనిస్సహా యంగా మారింది.

పాకిస్తాన్‌, ఇరాన్‌ సరిహద్దులకు దగ్గరగా ఉన్న మారుమూల పట్టణం జరంజ్‌ ఆఫ్గాన్ ల‌ అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా మారింది. భారీ మానవతా, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గానిస్తాన్ కుటుంబాలు తీవ్ర నిరాశకు గురవుతు న్నాయి. విధిలేక వారు మానవ అక్రమ రవాణా దారులను ఆశ్రయిస్తున్నారు.

ఒక్కో కారులో 18-20 మందిని కుక్కేసి మరీ సరిహద్దులు దాటిస్తున్నారు. జరంజ్‌ నుంచి ఎడారి ప్రాంతం మీదుగా ఏడుగంటలపాటు ప్రయాణించి వీరిని పాకిస్తాన్‌ చేరుస్తున్నారు. వలసలకు సిద్ధమైన వారిని అక్రమంగా ఇరాన్‌కు రవాణా చేస్తున్నారు. తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దేశం విడిచిపెట్టిన వారి సంఖ్య రెండింతలు పెరిగిందని చెబుతున్నారు.

ఇమ్మిగ్రేషన్‌, వీసాల అవసరం లేకుండా సరిహద్దులు దాటిస్తున్నందున అఫ్గానిస్తాన్ లు ట్రాఫికర్లను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు తక్కువ రుసుము ట్రాఫికర్లు వసూలు చేస్తున్నారు. వలస వెళ్తున్న వారిలో ఎక్కువ మంది నిరాశకు గురైన పురుషులే. వారంతా పొరుగుదేశంలో ఉపాధి దొరుకుతుందనే ఆశతో దేశం విడిచి పారిపో తున్నారు. తాలిబన్ల ప్రవేశానికి ముందు అఫ్గానిస్తాన్ ప్రభుత్వంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఓ మహిళ కూడా ట్రాఫికర్ల సహాయంతో దేశం విడిచివెళ్లే సాహసం చేసింది.