గుజరాత్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు. ఇవాళ గాంధీనగర్లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా భూపేంద్ర పటేల్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. భూపేంద్ర పటేల్ పేరును మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు.
కేంద్ర పరిశీలకుడు నరేంద్రసింగ్ తోమర్ భూపేంద్ర పటేల్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అయితే, విజయ్ రూపానీ రాజీనామా చేసినప్పటి నుంచి కొత్త ముఖ్యమంత్రి రేసులో వినిపించిన కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయ, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్, సీనియర్ నేత పరుషోత్తమ్ రూపాలా పేర్లను ఈ సమావేశంలో పరిగణలోకే తీసుకోలేదు.
భూపేంద్ర పటేల్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ విషయం గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ మీడియాకు వెల్లడించారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన భూపేంద్ర పటేల్ ప్రస్తుతం ఘట్లోడియా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కు సన్నిహితుడిగా పేరొందిన ఆయన ఆమె ముఖ్యమంత్రి గవర్నర్ గా వెళ్లిన తర్వాత, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుండి 2017లో ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.
సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై లక్షకు పైగా ఓట్ల ఆధిక్యతతో మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు. ఈ నియోజకవర్గం అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనిది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం తన పదవికి రాజీనామా చేయడంతో.. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు ఇవాళ ఆ రాష్ట్ర శాసనసభాపక్షం సమావేశమైంది.
భూపేందర్ పటేల్ నాయకత్వంలో వచ్చే ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి గెలుపొందగలమని రూపాని భరోసా వ్యక్తం చేశారు. నూతన ముఖ్యమంత్రి కానున్న పటేల్ కు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అభినందనలు తెలిపారు. గాంధీనగర్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి, బీజేపీ జనరల్ సెక్రెటరీ తరుణ్ చుగ్ హాజరయ్యారు.
More Stories
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు
అమేథిలో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది