ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న 71వ ఏట అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టిన రోజు, 20 ఏండ్ల ప్రజా సేవను పురస్కరించుకుని ‘సేవ సమర్పన్ అభియాన్’ పేరుతో 20 రోజుల మెగా ఈవెంట్కు కేంద్రంలోని అధికార బీజేపీ సన్నాహాలు చేస్తున్నది.
ఈ నెల 17 నుంచి అక్డోబర్ 7 వరకు 20 రోజుల పాటు భారీగా స్వచ్ఛభారత్ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నది. 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ తొలిసారి గుజరాత్ సీఎం అయ్యారు. సీఎం నుంచి ప్రధాని వరకు 20 ఏండ్ల ప్రజా సేవను పురస్కరించుకుని పలు కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమైంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయాలకు పలు సూచనలు జారీ చేశారు. ‘పార్టీ సభ్యులు ప్రజా సేవకు అంకితమవుతారు. మోదీ కృషికి అభినందనలు తెలిపేందుకు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ బూత్ల నుండి ఐదు కోట్ల పోస్ట్ కార్డులు ప్రధానమంత్రికి పంపుతారు’ అని అధికార ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రచారంలో భాగంగా ఉచిత ఆహార ధాన్యాలు, పేదలకు టీకాలు వేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపే హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని జీవితానికి అంకితమైన ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ సభ్యులను నడ్డా కోరారు. నామో యాప్ ద్వారా వర్చువల్ ఈవెంట్లకు హాజరు కావచ్చని పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ జీవితాన్ని వివరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలను ఆదేశించారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, రైతులకు మోదీ చేసిన సేవలను వివరించాలని తెలిపారు. నమో యాప్ ద్వారా వర్చువల్ ఈవెంట్స్లో కూడా పాల్గొనవచ్చునని తెలిపారు.
రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ సరుకులు తీసుకునేవారితో మోదీకి ధన్యవాదాలు చెప్పిస్తూ వీడియోలు చిత్రీకరించాలని ఆదేశించారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ యువజన విభాగాన్ని కోరారు. కాగా, ఈ నెల 17న జిల్లా స్థాయిలో ఆరోగ్య శిభిరాలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్లో బీజేపీ కార్యకర్తలు 71 చోట్ల గంగా నదిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపడతారు. ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ కింద ఆహార పదార్థాలను మహిళా నాయకులు పంపిణీ చేస్తారు.
ప్రజాప్రతినిధులంతా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి అవగాహన కల్పించడంతోపాటు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెబుతారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున భారీగా పరిశుభ్రత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఖాదీ, స్థానిక ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ బహిరంగ సందేశాలు ఇస్తారు.
కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు పీఎం కేర్ ప్రయోజనం కోసం వారి పేర్లను బీజేపీ కార్యకర్తలు నమోదు చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న అన్ని బహుమతులను ప్రభుత్వ వెబ్సైట్ pmmemontos.gov.in ద్వారా వేలం వేస్తారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా, డీ పురందేశ్వరి, వినోద్ సోంకర్, రాష్ట్రీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజ్కుమార్ చాహర్కు అప్పగించారు.
More Stories
రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తొలగింపు
కొత్త ప్రభుత్వానికి 100 రోజుల మాస్టర్ ప్లాన్!
లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ నేడే