మన కాలపు వివేకానందుడు సర్వేపల్లి రాధాకృష్ణన్

అది మైసూర్ నగరం.ఒక ఉపాధ్యాయుని ఇల్లు.
ఆరోజు ఆ ఉపాధ్యాయుడు మైసూర్ విశ్వవిద్యాలయం నుండి  అశుతోష్ ముఖర్జీ కోరికపై, కలకత్తా విశ్వవిద్యాలయం లో పనిచేయడానికి వెడుతున్నారు.స్వయంగా మైసూర్ మహరాజు పంపిన సార్ట్ బండి ఆయన కోసం సిద్ధంగా ఉంది.ఆయన వచ్చి బండీలో కూర్చోగానే జరిగింది ఆ సంఘటన.
కొంతమంది విద్యార్థులు వచ్చి బండికి కట్టిన గుఱ్ఱాలను తీసి వేశారు. బండి కాడిని తమ భుజాలపైన వేసుకుని ఆ ఉపాధ్యాయుని మైసూర్ రైల్వే స్టేషన్ వరకూ ఆ గురువును ఊరేగింపుగా తీసుకు వెళ్ళారు. బహుశః ఆధునిక ప్రపంచంలో అంతటి గౌరవం పొందిన తొలి ఉపాధ్యాయుడు ఆయనే అయిఉండవచ్చు. 
ఆ రోజున ఈ సత్కారాన్ని పొందిన ఉపాధ్యాయుడు డా.సర్వేపల్లి రాథాకృష్ణన్.ఈ సత్కారాన్ని నిర్వహించిన విద్యార్థి బృందం నాయకుడు ఆతర్వాత రోజుల్లో కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా చేశాడు. ఆయన పేరు ఎస్.నిజలింగప్ప.ఇది 1921 నాటి సంఘటన.
 
ఆంధ్రా యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ లకు వైస్ ఛాన్సలర్ చేసిన ఘనత ఆయనొక్కరిదే. ఒకసారి కొంతమంది మిత్రులు ఆయనతో సంభాషిస్తూ, మీలాంటి వారు ఆక్స్ ఫర్డ్,కేంబ్రిడ్జి వంటి యూనివర్సిటీ లలో విద్యాభ్యాసం చేసి ఉంటే మీ పేరు మరింతగా పరిమళించేది అన్నారట. 
 
అందుకు సమాధానమిస్తూ “,నేను ఆ యూనివర్సటీలకు విద్యార్థిగా కాదు.ఒక గురువుగా మాత్రమే వెళతాను” అని ఘనమైన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా 1937 నుండి ’57 దాకా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ విజిటంగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు.

హైస్కూల్ విద్య పూర్తి చేసుకుని కళాశాలలో చేరేటప్పుడు ఫీజుల కోసం తన బంధువులలో ఒకరిని సహాయం అడుగుదామని బయల్దేరిన రాథాకృష్ణన్ గారికి ఆ బంధువు మద్రాస్ స్టేషన్ లోనే ఎదురై తనదగ్గర సొమ్ము లేదని, పుస్తకాలు మాత్రం తనవి ఇవ్వగలనని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో చదువుకున్నారాయన.

బనారస్ హిందూ యూనివర్సిటీ లో వైస్ ఛాన్సలర్ చేస్తున్న కాలంలో ప్రతిరోజూ ఒక్కో అంశంపై విద్యార్థులకు ఉపన్యాసాలు చెప్పేవారు. ఆ గోడల దగ్గరకు వెడితే ఆ ఉపన్యాసాలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.


హిందూ ధర్మం లోని విశేషాలను అత్యంత సూక్ష్మంగా పశ్చిమ దేశాలకు వివరించి చెప్పిన మనకాలపు వివేకానందుడు సర్వేపల్లి రాథాకృష్ణన్!! ఆంధ్ర విశ్వకళా పరిషత్ ను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళిన మహనీయుడు ఆయన. అక్కడి విద్యార్థి వసతి గృహాలకు “నాగార్జున, సిద్ధార్థ, శాతవాహన” వంటి పేర్లు ఆయన పెట్టినవే!!

రష్యా కు భారత రాయబారిగా వెళ్ళి, అత్యంత మొండి వానిగా పేరొందిన జోసెఫ్ స్టాలిన్ ను ఆత్మీయంగా పలకరించిన ఔన్నత్యం డా.సర్వేపల్లి రాథాకృష్ణన్ ది. “నన్ను ప్రపంచమంతా ఒక నాయకునిగా మాత్రమే చూసింది. కాని నాలోని మనిషిని నాకు చూపించిన మహనీయుడు రాథాకృష్ణన్!” అని స్టాలిన్ చెప్పారు.

స్వతంత్ర భారతావనికి తొలి ఉపరాష్ట్రపతిగా ,రాష్ట్రపతిగా రాథాకృష్ణన్ ఆ పదవులకే అలంకారమయ్యారు. అప్పటి గ్రీక్ దేశపు అథ్యక్షునికి స్వాగతం చెబుతూ “మీకన్నా ముందే మీదేశం నుండి మా దేశానికి కొంతమంది వచ్చారు. కాని భారతదేశం తన హృదయ కవాటాలు తెరచి ఆహ్వానిస్తున్న గ్రీక్ దేశపు అద్యక్షులు మీరు.” అని అలగ్జాండర్ గురించి నర్మగర్భంగా చెప్పారు.

స్వతంత్ర భారతదేశాన్ని తొలిసారిగా సందర్శించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ ను భారత పార్లమెంట్ సభ్యులకు పరిచయం చేస్తూ, రాథాకృష్ణన్ మాట్లాడిన తీరుకు, ఆయన వాడిన ఆంగ్ల పదసంపదకు అచ్చెరువొంది ఐసెన్ హోవర్ తాను వ్రాసుకొచ్చిన ఉపన్యాసాన్ని తడబడుతూ చదివాడట.

అటువంటి మహనీయుని జన్మదినాన్ని యావద్భారత దేశం ఉపాథ్యాయ దినోత్సవం గా నిర్వహించుకుంటుంది. ఈ రోజున ఉపాధ్యాయములను గౌరవించుకొంటుంది. భారత  విజ్ఞాన సౌరభాలను, తాత్విక చింతనను ఆధునిక కాలంలో నలుదిశలా పరిచయం చేసిన మహా జ్ఞాని జన్మదినం నేడు.