కశ్మీర్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం చెందగా వారిలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన మరుపోలు జశ్వంత్రెడ్డి (23) ఉన్నారు. బాపట్ల మండలం దరివాదకొత్తపాలెం వాసి జశ్వంత్రెడ్డి ఐదేండ్ల కిందట సైన్యంలో చేరారు.
నెల క్రితమే సెలవుపై ఇంటికొచ్చిన ఆయనకు పెండ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఆయనకు తండ్రి శ్రీనివాసరెడ్డి, తల్లి వెంకటేశ్వరమ్మతోపాటు యశ్వంత్రెడ్డి, విశ్వంత్రెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జశ్వంత్రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజౌరి జిల్లా సుందర్బాన్ సెక్టార్లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టగా ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
కౌలు రైతుగా జీవనం సాగిస్తున్న తన తండ్రి ఆశయానికి అనుగుణంగా ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన జశ్వంత్రెడ్డి 2015లో ఆర్మీలో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఆయన జమ్మూకశ్మీర్లో ఇన్ఫ్రాంటీ విభాగంలో జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. తన చిన్న తమ్ముడు విశ్వంత్రెడ్డిని ఐఏఎస్ అధికారిని చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్లో ఒక కోచింగ్ అకాడమీలో చేర్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు.
బుధవారం సాయంత్రం చివరిసారిగా తమతో మాట్లాడుతూ.. ‘నేను అడవుల్లో ఉన్నాను.. నా ఫోన్ మా సార్ దగ్గర ఉంది.. వేరే సార్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నా.. నాన్నా మీరంతా బాగున్నారా.. పూలతోటలు ఎలా ఉన్నాయి.. ఒక్కసారి ఫోన్ అమ్మకివ్వు… అమ్మా నేను ఈరోజు కూడా అడవుల్లోనే ఉన్నాను. రేపు, ఎల్లుండి కూడా ఇక్కడే ఉండాలి.. రూమ్కు వెళ్లాక ఫోన్ చేస్తాను.. మీరంతా బాగున్నారా’ అని అన్నాడని, ఇంతలోనే తమ బిడ్డ మరణవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
వీర జవాన్ జశ్వంత్రెడ్డి భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో తరలించారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో ఆయన స్వగ్రామం దరివాద కొత్తపాలెం కొచ్చారు. శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
వీర జవాన్ జశ్వంత్రెడ్డి మృతిపట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో మృతి చెందిన వీర జవాన్ జశ్వంత్రెడ్డి చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. దేశ రక్షణకు తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారని, ఆయన త్యాగం నిరుపమానమైనది అని కొనియాడారు.
More Stories
మహిళలు, రైతులు, నిరుద్యోగులపై కూటమి వరాల జల్లు
నామినేషన్లకు గడువు ముగింపు… పోటీలో అభ్యర్థులు ఖరారు
మూడు పార్టీల మేనిఫెస్టో విడుదల రేపే