కరోనా మహమ్మారితో ‘ప్రమాదకరమైన దశ’లో ప్రపంచం

కరోనా మహమ్మారితో ‘ప్రమాదకరమైన దశ’లో ప్రపంచం

కరోనా మహమ్మారితో ప్రపంచం ‘ప్రమాదకరమైన దశ’లో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయేసన్‌ హెచ్చరించారు. కొవిడ్‌ వైరస్‌ డెల్టా లాంటి వేరియంట్లు కాలక్రమేణా నిరంతరం మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

తక్కువ జనాభాకు టీకాలు వేసిన దేశాల్లో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య మళ్లీ పెరగడంపై ప్రారంభమైందని తెలిపారు. ఇప్పటికీ ఇంకా ఏ దేశం ప్రమాదం నుంచి బయట పడలేదని.. డెల్టా వేరియంట్‌ ప్రమాదకరమైందని, వైరస్‌ కాల క్రమేణా మారుతున్నందున నిరంతరం దాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 

వేరియంట్‌ను 98 దేశాల్లో గుర్తించామని, చాలా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. కఠినమైన నిఘా, ప్రారంభంలో వ్యాధిని గుర్తించడం, ఐసోలేషన్‌ చేయడం ఇప్పటికీ ముఖ్యమేనని పేర్కొన్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, రద్దీ ప్రదేశాలను నివారించడం, ఇండ్లను వెంటిలేషన్‌ చేయడానికి తగిన ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని టెడ్రోస్‌ పేర్కొన్నారు.

వచ్చే ఏడాది నాటికి ప్రతి దేశ జనాభాలో 70 శాతం మందికి కొవిడ్‌ టీకాలు వేసేలా చూడాలని ప్రపంచ నేతలను కోరారు. తక్కువ టీకాలు వేసిన దేశాల్లో వైరస్‌ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు.

వ్యాక్సిన్‌ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ఫార్ములాను పంచుకోవాలని ఫైజర్‌, బయో ఎన్‌టెక్‌, మోడెర్నా సంస్థలకు సూచించారు. దీంతో ఎక్కువగా టీకాలు ఉత్పత్తి చేసి, గ్లోబల్‌ ఇమ్యునైజేషన్‌ పెంచి మమహమ్మారి ఉధృతిని త్వరగా తగ్గించవచ్చన్నారు.