భారత్ – అమెరికా భాగస్వామ్యానికి ప్రపంచ ప్రాముఖ్యత

అమెరికాతో భారత్‌కు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రపంచ ప్రాముఖ్యత ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం నాడు అమెరికా 245వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు మోడీ శుభాకాంక్షలు చెపుతూ ఒక సందేశం పంపారు. 

బైడెన్‌తోపాటు దేశ ప్రజలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెబుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారత్‌, అమెరికా స్వేచ్ఛ, స్వాతంత్ర విలువలను పంచుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. 

పొరుగున ఉన్న చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) ఇటీవల తన శతవార్షిక సంబరాలు జరుపుకుంటున్న సమయంలో మౌనంగా ఉన్న భారత్‌, అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్పందించడం గమనార్హం. 

అయితే సిపిసి వేడుకలను పార్టీ పరంగా చూసిన భారత్‌ శుభాకాంక్షలు తెలపలేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రస్థానానికి మన దేశంలో వామపక్షాలు శుభాకాంక్షలు తెలుపగా, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు మౌనంగా ఉన్నాయి.