కెనడావాసులు భారత దేశానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్తున్నారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడు విజ్ఞప్తి మేరకు కోవిడ్-19 వ్యాక్సిన్ను అందజేసినందుకు ధన్యవాదాలు చెప్తూ టొరంటోలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.
గ్రేటర్ టొరంటో ఏరియాలో ఏర్పాటు చేసిన ఈ కటౌట్లకు ఇండో-కెనడియన్ కమ్యూనిటీ గ్రూప్ స్పాన్సర్ చేసింది. భారత దేశం, కెనడా జాతీయ జెండాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ఈ కటౌట్లపై ప్రచురించారు. ‘‘ధన్యవాదాలు, భారత దేశం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కెనడా-భారత దేశం మైత్రి కలకాలం నిలవాలి’’ అని వీటిపై రాశారు.
గ్రేటర్ టొరంటో ఏరియాలో బుధవారం తొమ్మిది కటౌట్లను ఏర్పాటు చేశారు. బ్రాంప్టన్లో సోమవారం మరొక నాలుగు కటౌట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇండో-కెనడియన్ కమ్యూనిటీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కటౌట్లను ఏర్పాటు చేసిన కెనడా హిందూ ఫోరం అధ్యక్షుడు రావు యండమూరి మాట్లాడుతూ, కెనడా, భారత దేశం మధ్య సహజ స్నేహ సంబంధాలను గట్టిగా చెప్పడమే తమ లక్ష్యమని తెలిపారు. కెనడాకు కోవిడ్-19 వ్యాక్సిన్లను భారత దేశం పంపించిన విషయాన్ని చాటి చెప్పడం కోసమే వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మన దేశంలో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ గత బుధవారం కెనడాకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు మిలియన్ల కోవిడ్-19 వ్యాక్సిన్ల డోసులను కెనడాకు పంపిస్తారు. ఈ వ్యాక్సిన్లు మే నెల రెండో వారానికల్లా కెనడా చేరుకుంటాయని తెలుస్తోంది.
More Stories
ఉక్రెయిన్లో నాలుగు పవర్ ప్లాంట్లు ధ్వంసం
సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారి
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్