రాహుల్ మాట తప్పారు!….. రాజకీయం చేస్తున్నారు

రాహుల్ మాట తప్పారు!….. రాజకీయం చేస్తున్నారు
 
* ప్రధాని ఇంటి ముందు రాహుల్ ధర్నాపై కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, ధర్మేంద్ర ప్రధాన్ మండిపాటు 

ప్రధాని ఇంటి సమీపంలో రాహుల్‌గాంధీ ధర్నా చేసిన సంఘటన తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. నెలరోజులకు పైగా సిపిజే ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా జరుగుతున్నా పట్టించుకోని రాహుల్ గాంధీ అకస్మాత్తుగా ప్రధాని ఇంటి ముందు ధర్నాకు ఉపక్రమించడం పట్ల కేంద్ర మంత్రులు ధ్వజమెత్తారు. పార్లమెంట్ లో చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే ధర్నా విరమిస్తామని హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ, అందుకు ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత మాట మార్చారని కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ మండిపడ్డారు. 

రాహుల్ గాంధీ విద్యార్థులను `రాజకీయ పావులు’గా వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. 

” కాంగ్రెస్ నేతలతో చర్చించాలని ప్రభుత్వం నన్ను పంపించింది. నేను వెళ్లి ధర్నా చేసేందుకు ఇది సరైన వేదిక కాదని రాహుల్ గాంధీకి చెప్పాను. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని కోరాను. దీనితో నీట్ అక్రమాలు, దానిపై జరుగుతున్న ఆందోళనలు సహా అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించాలని రాహుల్ గాంధీ కోరారు” అని తెలిపారు. 

“ఇందుకు ప్రభుత్వం అంగీకరిస్తే, వెంటనే తమ నిరసనలను విరమిస్తామని నాకు చెప్పారు. నేను ప్రభుత్వాధినేతలకు ఆ విషయం చెప్పి, వారి అభిప్రాయాలను తెలుసుకొన్న కొద్ది సేపటిలోనే రాహుల్తో మాట్లాడాను. నీట్, దానికి సంబంధించిన ఉద్యమాలు, ఇతర విషయాలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాహుల్ గాంధీకి హామీ ఇచ్చాను. ఇది విన్న రాహుల్ గాంధీ దీనికి మాత్రమే తాను అంగీకరించనని చెబుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కూడా హామీ కావాలని కోరారు” అని వెల్లడించారు. 

“అంతకు ముందు కేవలం చర్చ జరగాలని మాత్రమే మీరు డిమాండ్ చేశారని గుర్తు చేశాను. దానికి ఆయన ఇప్పుడు తన డిమాండ్లు మారాయని అన్నారు. రాహుల్ లాంటి నేత తన మాట తప్పడం దురదృష్టకరం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం” అని జితేంద్ర సింగ్ విమర్శించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాహుల్ గాంధీ విద్యార్థులను ‘రాజకీయ సాధనాలుగా’ వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ వివాదంపై తన తొలి స్పందనలో, నీట్ పేపర్ లీక్ అంశంపై ఉన్న ఆందోళనలను నిర్మాణాత్మకంగా పరిష్కరించడానికి బదులుగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ అంతరాయం సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ప్రధాన్ ఆరోపించారు.

 ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌లో, నీట్ అంశంపై పార్లమెంటులో సమగ్ర చర్చకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వెలుపల నిరసన చేపట్టారని కేంద్ర మంత్రి విమర్శించారు. “పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా అంతరాయం సృష్టించడానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సిగ్గులేకుండా విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటూనే ఉన్నారు,” అని ప్రధాన్ రాశారు. 
ఈ నిరసన ప్రజలకు అసౌకర్యం కలిగించిందని, నిర్ధారిత భద్రతా ప్రోటోకాల్‌లను ఉల్లంఘించిందని ఆయన పేర్కొన్నారు. “సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రజాస్వామ్య చర్చకు బదులుగా రాజకీయ ప్రదర్శననే ఎంచుకుంది. విద్యార్థులకు పరిష్కారాలు అందించడం వారి లక్ష్యం ఎన్నడూ కాదు. కేవలం రాజకీయ శీర్షికల కోసం గందరగోళం సృష్టించడమే,” అని ప్రధాన్ ధ్వజమెత్తారు. 
“రాహుల్ గాంధీకి ఇది విద్యార్థుల గురించి కాదు. చర్చకు అన్ని నిజమైన మార్గాలు తెరిచిన తర్వాత, ఘర్షణను సృష్టించడమే వారి లక్ష్యం,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “మన విద్యార్థులకు మనం సమాధానాలు చెప్పాలి….” అని పేర్కొంటూ నీట్ సమస్యపై చర్చించడానికి, పార్లమెంటులో విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాన్ స్పష్టం చేశారు.
 “సభలో నీట్ గురించి చర్చించడానికి, మన యువత ప్రతి నిజమైన ఆందోళనను పరిష్కరించడానికి మా ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. రాజకీయ ప్రచారంలో పావులుగా చూడబడటం కంటే భారతదేశ విద్యార్థులు చాలా మెరుగైన దానికి అర్హులు. వారు గందరగోళానికి బదులుగా నిశ్చయతకు, నినాదాలకు బదులుగా పరిష్కారాలకు, ఆటంకానికి బదులుగా బాధ్యతకు అర్హులు,” అని ఆయన హితవు చెప్పారు.
 “మన విద్యార్థులకు మనం ఆగ్రహం కంటే ఎక్కువ ఇవ్వాలి. వారికి మనం సమాధానాలు, సంస్కరణలు, జవాబుదారీతనం ఇవ్వాలి. వాటిని అందించడానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది,” అని ప్రధాన్ జోడించారు.