సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్‌ దాడి

సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్‌ దాడి

* పోర్టల్‌లోకి అనధికారికంగా 50 మంది విద్యార్థులు!

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌ పేమెంట్‌ సిస్టమ్‌పై సైబర్‌ దాడి జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ధృవీకరించింది. దాదాపు 50 మంది విద్యార్థులు పోర్టల్‌లోకి అనధికారికంగా లాగిన్‌ అయినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ప్రభుత్వం మీడియాకు వెల్లడించింది. కాగా, సీబీఎస్‌ఈ 12వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎస్ఎం) పద్ధతి కారణంగా తమ సమాధాన పత్రాలు తారుమారయ్యాయంటూ కొందరు విద్యార్థులు ఇటీవల ఆందోళనలు వ్యక్తంచేశారు.

ఈ పోర్టల్ పై అనధికారిక దాడులు జరిగాయని, చెల్లింపుల గేట్ వే హెచ్ డి ఎఫ్ సికి అనుసంధానించబడి ఉందని, సుమారు 50మంది విద్యార్థులు యాక్సిస్ అయ్యారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి పేమెంట్ గేట్‌వే అనుసంధానంలో జరిగిన లోపాల ఆధారంగా ఈ దాడి జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో పోర్టల్‌లో ఫీజుల తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. 

సాధారణంగా ఉండాల్సిన రీ-ఇవాల్యుయేషన్ ఫీజులు ఒక్కసారిగా మారిపోయాయని, కొందరికి కేవలం ఒక రూపాయి ఫీజుగా  చెల్లించాలని కనిపిస్తే, మరికొందరికి ఏకంగా 68,000 రూపాయలు చెల్లించాలని చూపినట్లు వెల్లడించారు. ఈ సమస్య కారణంగా 12వ తరగతి జవాబు పత్రాల ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకునే వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం, రీ-ఇవాల్యుయేషన్ మౌలిక సదుపాయాలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.  అయితే, హెచ్‌డీఎఫ్‌సీ చెల్లింపులకు సంబంధించిన గేట్‌వేలో మాత్రమే ఈ సమస్యలు ఎదురైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సైబర్‌ దాడిపై అధికారులు అప్రమత్తమయ్యారు. 

ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ కాన్పూర్‌కు చెందిన సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తున్నారు. ఓఎస్‌ఎం పద్ధతి నేపథ్యంలో తమ జవాబు పత్రాలు మారిపోయాయని సీబీఎస్‌ఈకి పలువురు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం 20 జవాబు పత్రాలు తారుమారైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయా విద్యార్థులను సంప్రదించి వారికి సరైన జవాబు పత్రాలను కూడా అందించినట్లు తెలిపాయి.  అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యుఎస్), నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ప్రత్యామ్నాయ పేమెంట్ గేట్‌వేలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.