కెనడాలో భారత విద్యార్థిని దారుణ హత్య 

కెనడాలో భారత విద్యార్థిని దారుణ హత్య 
కెనడాలోని  నయాగరా ప్రాంతంలో భారతీయ విద్యార్థిని  విధి మేఘ దారుణ హత్యకు గురైంది. దుండుగులు విధి మేఘనిను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. అంతర్జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బొర్సాద్ ప్రాంతానికి చెందిన విధి కల్పేష్‌భాయ్ మేఘా (22) అనే యువతి కెనడాలో చదువుకుంటోంది. 
 
మృతురాలిని గుజరాత్‌ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లా, బోర్సాద్ పట్టణానికి చెందిన విధి కల్పేష్‌భాయ్ మేఘాగా గుర్తించారు. ఆమె గత నాలుగేళ్లుగా కెనడాలో నివసిస్తూ ఉన్నత చదువులు చదువుకుంటోంది. చదువుతో పాటు తన రోజువారీ ఖర్చుల నిమిత్తం విధి అక్కడ ఒక పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తోంది.
త్వరలో కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా సిద్ధమైంది.
 
ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీనిపై కుటుంబ సభ్యులు, ఆమె సన్నిహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు.  విధి మేఘ కోసం వెతుకుతుండగా కెనడాలోని నయాగారా ప్రాంతంలో, కెనడా–అమెరికా సరిహద్దులో ఆమె మృతదేహం లభ్యమైంది. 

ఈ నెల 15న ఈ దారుణమైన ఘటన జరిగినట్లు కెనడా పోలీసులు ధృవీకరించారు. విధిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి అక్కడికక్కడే మరణించేలా చేశాడు. అయితే, ఈ హత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘోరంపై కేసు నమోదు చేసుకున్న కెనడా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 

పరారీలో ఉన్న హంతకుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇటీవలి కాలంలో కెనడాలో భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. భారతీయులు హత్యకు కూడా గురవుతున్నారు. గత ఏడాది డిసెంబర్‌‌లో శివాంక్ అవస్థి అనే 20 ఏళ్ల భారతీయ వైద్య విద్యార్థిని టొరంటోలో కాల్చి చంపారు. 

2025 ఏప్రిల్‌లో హర్‌‌సిమ్రత్ రంధావా అనే 21 ఏళ్ల భారతీయ విద్యార్థి కూడా హత్యకు గురయ్యారు.  రెండు గ్రూపులు కాల్పులు జరుపుకోగా, ఈ ఘటనలో హర్‌‌సిమ్రత్ ప్రాణాలు కోల్పోయారు. 2024 డిసెంబర్‌‌లో కూడా హర్ష్‌దీప్ సింగ్ అంటాల్ కూడా హత్యకు గురయ్యాడు. ఇలా పలువురు భారతీయులు హత్యకు గురవుతుండటంతో కెనడాలోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు.