ఎమ్యెల్సీగా అజారుద్దీన్, కోదండరామ్.. గవర్నర్ ఆమోదం 

ఎమ్యెల్సీగా అజారుద్దీన్, కోదండరామ్.. గవర్నర్ ఆమోదం 
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. దీంతో ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. గత ఏడాది ఆగస్టు 30న పంపిన ఈ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా లోక్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో చర్చలు జరపడంతో ఈ ప్రతిష్టంభనకు తెరపడింది. ముఖ్యంగా ఏ సభలోనూ సభ్యుడిగా లేకుండానే గతేడాది నవంబర్‌లో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటంతో అక్కడ టికెట్ ఆశించిన అజారుద్దీన్‌కు ఏకంగా మంత్రి పదవి ఆఫర్ చేశారు.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలలలోపు అంటే ఏప్రిల్ 30 లోగా ఏదైనా ఒక సభకు ఆయన ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఒకవేళ ఈ గడువులోగా ఎమ్మెల్సీగా నియామకం జరగకపోతే ఆయన తన మంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఉండేది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నియామకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గడువు ముగియడానికి కేవలం ఐదు రోజుల ముందే గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మంత్రి అజారుద్దీన్‌కు లైన్ క్లియర్ అయింది. 

 
కాగా, బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రావణ్ పేర్లను సిఫార్సు చేశారు. అయితే వారి నియామకాన్ని అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్తగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ప్రతిపాదించగా ఇన్నాళ్లూ ఆ ఫైల్ పెండింగ్‌లో ఉంది. 
 
ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా లోక్‌భవన్ వెళ్లి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సమావేశమయ్యారు. అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీలుగా నియమించే ఫైల్‌ను క్లియర్ చేయాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన గవర్నర్ తాజాగా వారిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తూ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.