రాజమండ్రి- విశాఖ మధ్య రూ.9,889 కోట్లతో మరో 2 రైల్వే లైన్లు 

రాజమండ్రి- విశాఖ మధ్య రూ.9,889 కోట్లతో మరో 2 రైల్వే లైన్లు 
రాజమండ్రి – విశాఖపట్నం మధ్య రూ.9,889 కోట్లతో 198 కిలోమీటర్ల మేరకు మరో రెండు రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ శనివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నిడదవోలు-దువ్వాడ రైల్వే స్టేషన్లను కలుపుతూ రైల్వే లైన్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాల మీదుగా ఈ రైల్వే ప్రాజెక్టు రానుంది.

ఎక్కువ రద్దీ ఉన్న చెన్నై – హౌరా మధ్య నాలుగు లైన్లు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏపీలోని తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాలను కవర్‌ చేస్తుందని పేర్కొన్నారు. ఈ మార్గం సామర్థ్యం ఇప్పటికే 130 శాతానికి చేరుకోవడంతో తరచూ రద్దీ, ఆలస్యం పెరుగుతోందని తెలిపారు.  ప్రాజెక్టులో భాగంగా గోదావరి నది మీద 4.3 కిలోమీటర్ల రైలు వంతెన, 2.67 కిలోమీటర్ల వయాడక్ట్, 3 బైపాస్‌లు నిర్మాణం జరగనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్‌ వెల్లడించారు.

తూర్పు తీరంలోని విశాఖ, గంగవరం, మచిలీపట్నం, కాకినాడ ప్రధాన పోర్టులకు అనుసంధానం పెరుగుతుందని వివరించారు.  అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం వంటి కీలక ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలకు ఎక్కువ అనుసంధానం పెరుగుతుందని స్పష్టం చేశారు. రోడ్డు రవాణాతో పోలిస్తే ఏటా సుమారు రూ.1,150 కోట్ల మేర ఆదా అవుతుందని, డీజిల్‌ కాలుష్య ప్రభావం గణనీయంగా తగ్గనున్నట్లు కేంద్రం అంచనా వేసినట్లు అశ్విని వైష్ణవ్‌ వివరించారు.

ఇప్పటివరకు రైలు అనుసంధానం లేని 11 మార్గాల్లో కొత్త లైన్ల నిర్మాణంపై రైల్వేశాఖ దృష్టిపెట్టింది. కొన్నిచోట్ల బైపాస్‌ లైన్లు, రైల్‌ ఒవర్‌ రైల్‌ వంతెనల నిర్మాణంపైనా దృష్టిపెట్టారు. హైదరాబాద్‌-బెంగళూరు మధ్య నిర్మించే హైస్పీడ్‌ కారిడార్‌లో ఏపీలో 300 కి.మీ., హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ కారిడార్‌లో ఏపీలోని 464 కి.మీ.కు డీపీఆర్‌లపై దృష్టిపెట్టారు. విజయవాడ-చెన్నై, విజయవాడ-హైదరాబాద్, విజయవాడ-విశాఖపట్నం మార్గాల్లో సరకు రవాణా రైళ్ల రాకపోకలు అంతకంతకు పెరుగుతున్నాయి.

దీంతో ఈ మార్గాల్లో మూడు, నాలుగో లైన్ల నిర్మాణంపై దృష్టిపెట్టారు. ఇప్పటికే కొన్ని మార్గాల్లో మూడో లైను నిర్మిస్తున్నారు.  ఒడిశా వైపు నుంచి కొత్తవలస మీదుగా విశాఖపట్నానికి బొగ్గు, వివిధ ఖనిజాలు రవాణాచేసే రైళ్లు భారీగా ఉంటున్నాయి. దీంతో విశాఖపట్నంలోని సింహాచలం నార్త్‌ నుంచి కొత్తవలస వరకు ఐదు, ఆరో లైన్ల నిర్మాణానికి డీపీఆర్‌లు రూపొందించారు.