డ్రగ్స్‌ వినియోగంలో భారత్ పోటీ   

డ్రగ్స్‌ వినియోగం లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడుతున్నది. ప్రపంచంలోని డ్రగ్స్ భారీగా వినియోగిస్తున్న టాప్‌-10 నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో, దేశ ఆర్థిక రాజధాని ముంబై ఆరో స్థానంలో ఉంది.

ఢిల్లీవాసులు ఏటా 34 వేల 708 కిలోల డ్రగ్స్‌ వినియోగించగా, ముంబై వాసులు ప్రతీ ఏటా 29 వేల 374 కిలోల మాదక ద్రవ్యాలను వాడుతున్నారని జర్మనీకి చెందిన ఏబీసీడీ అనే సర్వే సంస్థ వెల్లడించింది. ఈ‌ పరిశోధన సంస్థ ప్రపంచంలోని 120 దేశాల్లో 2018 డ్రగ్స్‌ వినియోగంపై డేటా ఆధారంగా జాబితాను రూపొందించింది.

ఏబీసీడీ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్‌ వినియోగం లో న్యూయార్క్‌ నగరం మొదటి స్థానంలో ఉన్నది. ఇక్కడి ప్రజలు ప్రతి ఏటా 70 వేల 252 కిలోల మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. పాకిస్తాన్ లోని కరాచీ నగరం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 38 వేల 56 కిలోల డ్రగ్స్‌ను వినియోగిస్తారు.

నాలుగో స్థానంలో అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ ( 32,713 కిలోలు), ఐదోస్థానంలో ఈజిప్ట్‌లోని కైరో ( 29,565 కిలోలు), ఏడో స్థానంలో ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌ (28,485 కిలోలు), ఎనిమిదోస్థానంలో అమెరికాలోని షికాగో (22,262 కిలోలు), తొమ్మిదోస్థానంలో రష్యా రాజధాని మాస్కో ( 20,747 కిలోలు), పదో స్థానంలో కెనడా రాజధాని టొరంటొ ( 20,638 కిలోలు) ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగంలో టాప్‌-10 నగరాల్లో ఢిల్లీ, ముంబై చోటు సాధించడం గమనార్హం. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం 2019లో 3.42 లక్షల కిలోల కంటే ఎక్కువ మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. 35,310 మందిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. అరెస్ట్‌ అయిన వారిలో 35 వేల మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు.

గత 5 ఏండ్లలో 2015 – 2019 మధ్య దేశవ్యాప్తంగా ఎన్‌సీబీ 14.74 లక్షల కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుంది. 2018 లో అత్యధికంగా 3.91 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. దేశంలో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని ఎన్‌సీబీ గణాంకాలు సూచిస్తున్నాయి.

గతేడాది 7,860 మంది డ్రగ్స్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్‌ అధిక మోతాదు కారణంగా 704 మంది మరణించారు. 2019లో డ్రగ్స్‌ కారణంగా 8,564 మంది మృతి చెందారు. దీని ప్రకారం ప్రతిరోజూ 23 మంది మాదకద్రవ్యాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. మాదకద్రవ్యాల వినియోగంలో ఉన్న చీకటి కోణాలు రోజుకొకటి బయట కు వస్తున్నసంగతి తెలిసిందే.