సారా ఖలీఫా ఈజిప్టులో టెలివిజన్ ప్రెజెంటర్గా గుర్తింపు పొందారు. భద్రత, నేరాలకు సంబంధించిన అంశాలపై ప్రసారమయ్యే ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే కార్యక్రమానికి ఆమె యాంకర్గా వ్యవహరించారు. సారా ఖలీఫా, ఇతర నిందితులు ముఠాగా ఏర్పడి విదేశాల నుంచి మాదకద్రవ్యాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకున్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వాటితో సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి విక్రయించేందుకు ముఠా సభ్యులు వేర్వేరు బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపింది. పోలీసు దర్యాప్తులో భాగంగా 750 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు, డ్రగ్స్ తయారీకి ఉపయోగించే పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ ల్యాబ్లుగా ఉపయోగిస్తున్నట్లు అనుమానించిన రెండు అపార్ట్మెంట్లను కూడా గుర్తించారు. అక్కడ అక్రమంగా కలిగి ఉన్న తుపాకులు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను సారా ఖలీఫా మొదటి నుంచి ఖండిస్తున్నారు. తనకు డ్రగ్స్తో ఎలాంటి సంబంధం లేదని ఆమె చెబుతున్నారు.
గతేడాది సెప్టెంబర్లో జరిగిన విచారణ సందర్భంగా, ఈజిప్టు యాంటీ నార్కోటిక్స్ అధికారుల కార్యాలయంలో డ్రగ్స్తో ఉన్న ఫొటోలు తీసే వరకు తాను వాటిని ఎప్పుడూ చూడలేదని న్యాయమూర్తికి చెప్పినట్లు సమాచారం. తాను జీవితంలో సిగరెట్ కూడా కాల్చలేదని దర్యాప్తు అధికారులకు తెలిపినట్లు ఈజిప్టు మీడియా పేర్కొంది. కోర్టులో సారా ఖలీఫా కన్నీటిపర్యంతమై తనను క్షమించాలని వేడుకున్నారు. కాగా, కోర్టు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఆమె తరఫు న్యాయవాది తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు.

More Stories
రూ.1.10 లక్షల కోట్లతో ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలు
మెట్రో రైల్ నెట్వర్క్లో అమెరికాను మించిపోతున్న భారత్!
జీ గ్రూప్ సుభాష్ చంద్రపై సీబీఐ ఎల్ఐసీ మోసం కేసు!