పర్వతారోహకులతో కరిగిపోతున్న హిమాలయాలు 

పర్వతారోహకులతో కరిగిపోతున్న హిమాలయాలు 

ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రతి సంవత్సరం ప్రయత్నించే పర్వతారోహకుల మూత్రం, ప్రతి క్లెంబింగ్‌ సీజన్‌లో టన్నుల కొద్దీ మంచును కరిగిస్తున్నదని పరిశోధనలు గుర్తించాయి. ఖుంబు హిమానీనదంపై ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేస్తుంటారు. కిచెన్లు, షవర్లు, జనరేటర్లు, వై-ఫై, కొన్ని సందర్భాల్లో వేడిచేసే ఫ్లోర్‌లు వంటి ప్రాథమిక సౌకర్యాలతో కూడిన దాదాపు 1,600 గుడారాలు ప్రతి సంవత్సరం ఈ హిమనీనదంపై వెలుస్తాయి.

వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే వేడి నేల ఉష్ణోగ్రత పెరుగడానికి కారణమవుతున్నది. ‘రీజినల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ చేంజ్‌’ జర్నల్‌లో నేపాల్‌, అమెరికన్‌ శాస్త్రవేత్తల బృందం ప్రచురించిన ఒక అధ్యయనం మానవ కార్యకలాపాలు హిమానీనదాన్ని ఏ విధంగా కరిగిస్తున్నాయో, విపత్తుకు ఎలా బాటలు వేస్తున్నాయో చెప్తున్నది.  

ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ఎవరెస్ట్ పర్వత బేస్ క్యాంప్ వద్ద వేల లీటర్ల మూత్రాన్ని పారబోయడంతో సహా మానవ కార్యకలాపాలు ఖుంబు హిమానీనదం వేగంగా కరిగిపోవడానికి కారణం కావచ్చు; ఇంధన వినియోగం, మూత్ర విసర్జన కలిసి ఏటా దాదాపు 2,500 టన్నుల మంచు కరిగిపోవడానికి లేదా నష్టపోవడానికి దోహదపడుతున్నాయి. 

26 ఆగస్టు 2026న నేపాల్‌ను ఒక భారీ ఆకస్మిక వరద వణికించింది. ఇది గ్రామాలను కొట్టుకుపోయేలా చేసి 1,300 మందికిపైగా ప్రజలను పొట్టనబెట్టుకున్నది. ఈ విపత్తు మంచు సరస్సు పగలడం వల్ల సంభవించిందని తేలింది. గ్లోబల్‌ వార్మింగ్‌, శిలాజ ఇంధనాల వాడకంతోపాటు, మానవ మూత్ర విసర్జన కూడా హిమానీనదం కరుగడానికి ఎలా కారణమవుతున్నదో ఈ కొత్త అధ్యయనం దృష్టి సారించింది. 

ఎక్కువ ఎత్తులో ఉండటం వల్ల పర్వతారోకులు ఎక్కువ నీరు తాగాల్సి వస్తున్నది. దీనివల్ల వారు ఎక్కువ మూత్ర విసర్జన చేస్తారు. పరిశోధకుల ప్రకారం.. 2023 సీజన్‌లో రోజుకు దాదాపు 6,766 లీటర్ల మూత్రం ఉత్పత్తి అయింది. మూత్రం ఒక్కటే చాలా వేడిని కలిగి ఉంటుందని, ఇది హిమానీనదం గణనీయంగా కరుగడానికి సరిపోతుందని తేలింది. 

ఆ వేడి పరిమాణం ఎంత మంచును కరిగిస్తున్నదో అంచనా వేస్తూ, ఆ ఒక్క ైక్లెంబింగ్‌ సీజన్‌లోనే హిమానీనదం 154 టన్నుల మంచును కోల్పోయిందని పరిశోధకులు తెలిపారు. మూత్రం కంటే పెద్ద సమస్య బేస్‌ క్యాంప్‌లో ఇంధన వినియోగం. 2023 సీజన్‌లో వంట, వేడి, విద్యుత్తు కోసం 824 ఎల్పీజీ సిలిండర్లు, 18,935 లీటర్ల కిరోసిన్‌, 5,130 లీటర్ల గ్యాసోలిన్‌ ఉపయోగించారు. మానవుల వల్ల జరిగే కరుగుదలలో ఇది దాదాపు 94 శాతం.

ఈ అధ్యయనం బేస్ క్యాంప్ చుట్టూ విస్తృతమైన ఉష్ణోగ్రత పెరుగుదల ధోరణిని కూడా గుర్తించింది. 1991 నుండి 2023 వరకు ఉన్న ల్యాండ్‌శాట్ ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి, క్యాంప్‌లోని ఉపరితల ఉష్ణోగ్రతలు సంవత్సరానికి సగటున 0.28°C చొప్పున పెరిగాయని పరిశోధకులు కనుగొన్నారు — ఇది చుట్టుపక్కల ఉన్న ఖుంబు హిమానీనదం అంతటా నమోదైన రేటుకు దాదాపు రెట్టింపు.