రూ.1,27,500 కోట్ల వ్యయంతో సెమికాన్ 2.0కు కేంద్రం ఆమోదం 

రూ.1,27,500 కోట్ల వ్యయంతో సెమికాన్ 2.0కు కేంద్రం ఆమోదం 

భారతదేశ సెమీకండక్టర్ డిజైన్, తయారీ వ్యవస్థ అభివృద్ధి కోసం మొత్తం రూ.1,27,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన సెమికాన్ 2.0కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారతదేశంలోని సెమీకండక్టర్ రంగానికి నిరంతర, దీర్ఘకాలిక మద్దతు అందించాల్సిన అవసరాన్ని గుర్తించి, సెమికాన్ 1.0 ద్వారా సాధించిన పురోగతి ఆధారంగా చేసుకొని సెమికాన్ 2.0ను సిద్ధం చేశారు.

ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో మన దేశాన్ని కీలక స్థానంలో నిలపాలన్న  ప్రభుత్వ నిబద్ధతను మరింత ముందుకు తీసుకెళ్లడమే సెమికాన్ 2.0 లక్ష్యం. దిగువ పేర్కొన్న ఆరు ప్రధానాంశాల ఆధారంగా సెమీ కండక్టర్ వ్యవస్థను సమగ్రంగా నిర్మించడమే సెమికాన్ 2.0 లక్ష్యంగా నిర్దేశించుకుంది.

1. డిజైన్   చిప్ డిజైన్‌లో సాధించిన తొలి విజయాన్ని ఆధారంగా చేసుకుని సెమికాన్ 2.0 పనిచేస్తుంది. ఇప్పటికే 105 అంకుర సంస్థలు చిప్‌లను అభివృద్ధి చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు ఈ డిజైన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. అంతేకాకుండా వ్యూహాత్మక, వాణిజ్య ఉత్పత్తుల అభివృద్ధికి గాను బిల్డింగ్ బ్లాక్‌లను గుర్తించారు. ఈ విధానంతో ఐపీలు, చిప్‌ల డిజైన్‌, వ్యవస్థలను అభివృద్ధి చేయడమే సెమికాన్ 2.0 లక్ష్యం. ఈ కార్యక్రమం పరిధిలో జరిగే ఈ కృషి భారతదేశాన్ని ఒక కీలకమైన సెమీకండక్టర్ చిప్ డిజైన్ ఐపీ దేశంగా నిలబెడుతుంది.

2. యంత్రాలుముడి పదార్థాలు: సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన యంత్రాల తయారీ, వాటి పరిశోధనాభివృద్దిలోనూ, ముడిపదార్థాలు, రసాయనాలు, వాయువుల తయారీలోనూ నిమగ్నమైన సంస్థలకు ప్రోత్సాహకాలను అందిస్తారు. ఇది సెమీకండక్టర్ల పరిశ్రమ సుస్థిరాభివృద్ధికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేస్తుంది. అదే విధంగా మన దేశంలో ప్రెసిషన్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమ అభివృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుంది. 

3. మరిన్ని ఫ్యాబ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం: 2028లో దేశంలో మొదటి ఫ్యాబ్ కేంద్రం ప్రారంభం కానున్న తరుణంలో భారతదేశం అనుసరిస్తున్న సెమీకండక్టర్ వ్యూహంపై ప్రపంచ విశ్వాసం మరింత పెరిగింది. మన దేశంలో చిప్ తయారీ కేంద్రాలను నెలకొల్పేందుకు మరిన్ని సంస్థలు ముందుకొచ్చేలా ప్రయత్నాలు జరుగుతాయి. వీటిలో సిలికాన్ ఫ్యాబ్‌లు, కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, డిస్క్రీట్ కాంపోనెంట్ ఫ్యాబ్‌లు, డిస్‌ప్లే ఫ్యాబ్‌లు మొదలైనవి ఉంటాయి. 

4. ఏటీఎంపీ/ఓఎస్ఏటీ పరిశ్రమను మరింత బలోపేతం చేయడం: ఏటీఎంపీ యూనిట్లు సాధించిన విజయంతో ఏటీఎంపీ/ఓఎస్ఏటీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి భారత్‌ను ప్రత్యామ్నాయ కేంద్రంగా ప్రపంచం పరిగణిస్తోంది. అత్యంత ఆధునిక ఏటీఎంపీ సాంకేతిక పరిజ్ఞానాల్లో కొన్నింటిని భారత్‌కు తీసుకురావడంపై దృష్టి సారించి వీటికి ప్రోత్సాహమందిస్తారు.

5. పరిశోధనాభివృద్ధి: 28 ఎన్ఎం–110 ఎన్ఎం నోడ్‌తో సెమీకండక్టర్ల ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు దేశీయంగానూ, విదేశాల్లోనూ ప్రముఖ ఆర్ అండ్ డీ కేంద్రాల సహకారంతో మరింత అధునాతన నోడ్‌లను, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తారు.

6. ప్రతిభను మెరుగుపరచడం: ఆధునికమైన ఈడీయే టూల్స్ ఆధారంగా సంక్లిష్టమైన చిప్ డిజైనింగ్‌లో 315 విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా 68,000 మంది విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు దీనిని మరింత అభివృద్ధి చేసి కళాశాల స్థాయిలో శిక్షణను బలోపేతం చేస్తారు. అంతేకాకుండా, క్లీన్ రూమ్, ఫ్యాబ్ నిర్మాణంతో పాటు ఈ రంగానికి సంబంధించిన ఇతర విభాగాల్లోనూ శిక్షణ అందించడంలో పరిశ్రమ చురుగ్గా పాల్గొంటుంది.

అలాగే అన్ని రంగాల్లోనూ ఆర్థికాభివృద్ధికి సెమికాన్ 2.0 తోడ్పాటును అందిస్తుంది. సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయడం ద్వారా జాతీయ భద్రతను బలోపేతం చేస్తుంది. కీలకమైన రంగాల్లో సాంకేతికపరంగా ముందంజలో ఉండేందుకు దోహదపడుతుంది. సంపూర్ణ వ్యవస్థ నిర్మాణానికి అనుసరిస్తున్న ఈ విధానం భారతదేశంలో సెమీకండక్టర్ డిజైన్, తయారీని వేగవంతం చేస్తుంది.

ఐఎస్ఎం 1.0 సాధించిన పురోగతి:

  • తయారీఇప్పటివరకూ రూ.1.64 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో పన్నెండు తయారీ యూనిట్లకు ఆమోదం లభించింది. వీటిలో ఒక సిలికాన్ ఫ్యాబ్, ఒక సిలికాన్ కార్బైడ్ ఫ్యాబ్, ఒక సమీకృత గాలియం నైట్రైడ్ మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే ఫ్యాబ్, తొమ్మిది ప్యాకేజింగ్ యూనిట్లు ఉన్నాయి. ఇవి గృహోపకరణాలు, పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఏరోస్పేస్ మొదలైన రంగాల్లో చిప్ అవసరాలను తీర్చగలవని భావిస్తున్నారు. ఆమోదం పొందిన 12 ప్రతిపాదనల్లో మైక్రాన్, కేన్స్, సీజీ సెమీ అనే మూడు సంస్థలు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించగా, మరో సంస్థ కూడా 2026లో ఉత్పత్తిని  ప్రారంభించే అవకాశం ఉంది.
  • డిజైన్అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల నుంచి ఇరవై నాలుగు సెమీ కండక్టర్ డిజైన్ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోసం ఆమోదం లభించింది. అలాగే 105 అంకుర సంస్థలు/ఎంఎస్ఎంఈలకు పరిశ్రమ ప్రామాణికమైన ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ) సాధనాల వినియోగానికి అనుమతులు మంజూరయ్యాయి. ఉపగ్రహ కమ్యూనికేషన్లు, డ్రోన్లు, నిఘా కెమెరాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) పరికరాలు, ఎల్ఈడీ డ్రైవర్లు, ఏఐ వ్యవస్థలు, టెలికాం సామగ్రి, స్మార్ట్ మీటర్లతో సహా విస్తృత శ్రేణికి చెందిన వ్యూహాత్మక, వాణిజ్య అనువర్తనాలకు అవసరమైన చిప్‌లను, ఎస్ఓసీలను రూపొందించడంలో ఈ సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. ఈ సంస్థలు డిజైన్, అభివృద్ధిలో వివిధ దశల్లో ఉన్నాయి. వర్కింగ్ మోడళ్లు విజయవంతమైన అనంతరం వినియోగదశ మొదలవుతుంది.