బద్రీనాథ్‌ విరాళాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

బద్రీనాథ్‌ విరాళాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌ ఆలయంలో విరాళాల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న, సస్పెండ్‌ అయిన బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ (బీకేటీసీ) ఉద్యోగి ప్రమోద్‌ నౌటియాల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అరెస్టు చేసింది. ఆయనను సోమవారమే కోర్టులో హాజరపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు, అతడు దెహ్రాదూన్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకున్న సిట్‌ అధికారులు గంటపాటు విచారించారు. అనంతరం ఆదివారం రాత్రి 9.45 గంటల నుంచి 10.15 గంటల మధ్య అతడిని అదుపులోకి తీసుకున్నారు. గోపేశ్వర్‌ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఉత్తరాఖండ్‌ పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిట్‌ కోరనుంది.

జూలై 2న ఆలయ హుండీ విరాళాల లెక్కింపు సందర్భంగా తీసిన సీసీటీవీ దృశ్యాల్లో ప్రమోద్‌ నౌటియాల్‌ అనుమానాస్పదంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. రూ.500, రూ.100 నోట్ల కట్టలు, బంగారం, వెండి నాణేలు, శాలిగ్రామ రాళ్లు, భక్తులు సమర్పించిన కానుకల కవర్లను తీసుకుంటున్నట్లు వీడియోల్లో కనిపించిందని పేర్కొన్నారు. 

లెక్కింపు గది నుంచి తన కార్యాలయానికి రెండు నుంచి మూడు సార్లు వెళ్లి వచ్చినట్లు కూడా సీసీటీవీ ఫుటేజీలో గుర్తించినట్లు తెలిపారు. దొంగిలించిన నగదు, విలువైన వస్తువులను తన కార్యాలయంలో దాచివేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బద్రీనాథ్ ఆలయంలో విరాళాల లెక్కింపు సమయంలో అక్రమాలు జరిగాయంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. 

ఆ తర్వాత భైరవ్​ సేన అనే సంస్థ ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని, నిందితులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత జులై 2న విరాళాల లెక్కింపు సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నగదును చోరీ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర విచారణకు ఆదేశించింది. 

బీకేటీసీ ఇన్‌చార్జి టెంపుల్‌ ఆఫీసర్‌ యుధ్‌వీర్‌ పుష్పవాన్‌ ఫిర్యాదు మేరకు బద్రీనాథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు సీసీటీవీ కంట్రోల్‌ అధికారి పన్వార్‌, విరాళాల లెక్కింపు సమయంలో అక్కడే ఉన్న హరేంద్ర కోఠారి తదితరుల వాంగ్మూలాలను కూడా సిట్‌ నమోదు చేసింది. ఆ తర్వాత గర్వాల్ డివిజన్ కమిషనర్​ ఈ కమిటీకి ఛైర్మన్​ నేతృత్వంలో ఒక త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.