దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఎయిమ్స్ సంస్థలో ‘కమ్యూనిటీ రేడియో స్టేషన్’ ప్రారంభించిన ఘనత బీబీనగర్ ఎయిమ్స్కే దక్కిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా కొనియాడారు. బీబీనగర్ ఎయిమ్స్ లో అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా 6 గ్రామాలను దత్తత తీసుకొని, ఇప్పటివరకు 547 ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి, దాదాపు 66,148 మంది గ్రామీణ రోగులకు వైద్య సంరక్షణ అందించడం విశేషం అని ప్రశంసించారు.
ఎయిమ్స్ నిర్మాణ పనులపై ఈరోజు సమగ్ర సమీక్ష నిర్వహించగా, ప్రస్తుతం 87% పనులు పూర్తయ్యాయని, మిగిలిన నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి ఈ సంస్థను 100% పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ పనులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారానికోసారి, అడిషనల్ సెక్రటరీ ప్రతి రెండు నెలలకోసారి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఇది 2008 నాటి పాత భవనం (గతంలో నిమ్స్ కోసం ఉద్దేశించింది) కావడంతో, దీనిని ఎయిమ్స్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం, రీస్ట్రక్చరింగ్, రెట్రోఫిట్టింగ్ (రెనోవేషన్) చేయడం ఎంతో సంక్లిష్టమైన పని అని చెప్పారు. అయినప్పటికీ అధునాతన వసతులతో రేడియోగ్రఫీ, ఓటీ కాంప్లెక్స్లను త్వరలోనే సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇది వైద్య విద్య, రోగుల సంరక్షణ, పరిశోధన రంగాలలో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ గా నిలవబోతోందని భరోసా ఇచ్చారు. ఏదైనా ఒక పెద్ద జాతీయ విద్యా వైద్య సంస్థ పూర్తిస్థాయిలో స్థిరపడటానికి కనీసం 10 సంవత్సరాల సమయం పడుతుందని పేర్కొంటూ జూన్ 2022లో మంజూరైన బీబీనగర్ ఎయిమ్స్, కేవలం నాలుగేళ్ల స్వల్ప కాలంలోనే ఎంతో వృద్ధి సాధించి సేవలందిస్తోందని నడ్డా గుర్తు చేశారు.
దీని కోసం రూ. 1,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ. 110 కోట్లు ఖర్చు చేశారని, ప్రస్తుతం ఇక్కడ 132 మంది ఫ్యాకల్టీ సభ్యులు, 133 మంది సీనియర్ వైద్యులు సేవలందిస్తున్నారని తెలిపారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు, 24 విభాగాలలో ఎండీ, 5 విభాగాలలో డీఎం/ఎంసీహెచ్ వంటి సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు.
బీబీనగర్ ఎయిమ్స్ ఓపీడీ విభాగంలో అన్ని ప్రధాన స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెబుతూ ఇక్కడ ప్రతిరోజూ సుమారు 1,800 మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ఇన్పేషెంట్ కేర్, ఎమర్జెన్సీ సేవలతో పాటు సిటీ స్కాన్, ఎంఆర్ఐ, డెక్సా వంటి అత్యాధునిక పరీక్షల సౌకర్యం ఉందని చెప్పారు. ‘ఈ-సంజీవని’ డిజిటల్ టెలిమెడిసిన్ ద్వారా ఇప్పటివరకు 1,56,000 మంది రోగులకు విజయవంతంగా వైద్య సలహాలు అందించారని వివరించారు.
ఇక్కడ పీఎం-జైతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని కూడా వర్తింపజేస్తున్నామని చెప్పారు. ఎయిమ్స్ అనేది కేవలం రోగులకు చికిత్స అందించే కేంద్రం మాత్రమే కాదు, ఇది ఒక అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థ అని స్పష్టం చేశారు. బీబీనగర్ ఎయిమ్స్లో పరిశోధనల కోసం ఇప్పటివరకు రూ. 64 కోట్ల గ్రాంట్లు మంజూరయ్యాయని, ప్రస్తుతం 129 రీసెర్చ్ ప్రాజెక్టులపై పనులు జరుగుతుండగా, ఇక్కడి ఫ్యాకల్టీ ఇప్పటివరకు 156 పరిశోధనా పత్రాలను ప్రచురించారని తెలిపారు.
ఢిల్లీ ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ పూర్తి స్థాయిలో పుంజుకోవడానికే 20 ఏళ్లు పట్టిందని, కానీ బీబీనగర్ ఎయిమ్స్ గత నాలుగేళ్లలోనే అద్భుతమైన ప్రగతి పథంలో సాగుతోందని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధాని మోద విజన్కు అనుగుణంగా, రాబోయే రోజుల్లో బీబీనగర్ ఎయిమ్స్ దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ అగ్రగామి (పయనీర్) వైద్య సంస్థగా మారుతుందని స్పష్టం చేశారు.

More Stories
నిర్భయంగా వ్యవహరించండి.. మీ చర్యలకు నాదే బాధ్యత
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట
మోదీపై అభ్యంతరకర పోస్టులపై ఎఫ్ఐఆర్