బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్​ను మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని, జామీనుతో పాటు రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. బండి భగీరథ్‌పై పేటబషీరాబాద్ పీఎస్‌లో పోక్సో కేసు నమోదు కాగా, మే 16న అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

బండి భగీరథ్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ భగీరథ్‌ విద్యార్థి అని, 45 రోజులకు పైగా జైలులో ఉండటంతో జీవితంలో చాలా కోల్పోయాడని తెలిపారు. పరస్పర అంగీకారంతో జరిగిన దానిపై కేసులు నమోదు చేయడం చెల్లదని, ఇదే విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులు పలు తీర్పుల్లో వెల్లడించాయన్నారు. బెయిల్‌ మంజూరు చేస్తే కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటారని తెలిపారు.  

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ మే 8న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన వెంటనే వాంగ్మూలాల సేకరణ మొదలైందని తెలిపారు. దర్యాప్తు దాదాపు పూర్తికావచ్చిందని, గడువులోగా అభియోగ పత్రాన్ని దాఖలు చేస్తామని చెప్పారు. ఈ దశలో బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.సుజన తీర్పును బుధవారంకు వాయిదా వేశారు. తాజాగా భగీరథ్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

తన మైనర్ కుమార్తెను బండి భగీరథ్‌ లైంగికంగా వేధించాడంటూ ఆ బాలిక తల్లి మే 8న పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు​ చేయగా అతనిపై ఫోక్సో కేసు నమోదైంది. 17 ఏళ్ల బాలికను బండి భగీరథ్​ లైంగికంగా వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరించడం, నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుమార్తెకు ఇష్టం లేకున్నా ఫామ్‌హౌస్‌, ప్రైవేటు అపార్ట్​మెంట్లకు రావాలని భగీరథ్‌ బలవంతం చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. 

దీనిపై సమగ్రంగా విచారణ జరిపిన అనంతరం మే 16న పోలీసులు బండి భగీరథ్​ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తన బీబీఏ పరీక్షలు రాసేందుకు వీలుగా హైకోర్టు అతడికి మధ్యంతర బెయిల్  ఇవ్వగా, ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ లభించింది.