హోర్ముజ్ జలసంధి సమీపంలో పనామా జెండా ఉన్న చమురు ట్యాంకర్పై దాడి జరిగిన తర్వాత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా ఇరాన్పై మరో విడత సైనిక దాడులు జరిపింది. కేవలం రెండు వారాల క్రితమే ఒక పెళుసైన శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ, ఈ దాడులు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. పశ్చిమ ఆసియాలో దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పే లక్ష్యంతో వాషింగ్టన్, టెహ్రాన్లు అవగాహన ఒప్పందం పై సంతకాలు చేసిన తర్వాత, ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు సంబంధించి అమెరికా సైనిక చర్యలు చేపట్టడం ఇది వరుసగా రెండో రోజు.
రెండు రోజుల వ్యవధిలో హర్మూజ్ జలసంధిలో మరో చమురు ట్యాంకర్పై దాడి జరిగిందని బ్రిటన్కు చెందిన యునైటెడ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. చమురు ట్యాంకర్ను గుర్తుతెలియని క్షిపణి తాకిందని ఎక్స్ వేదికగా ప్రకటించింది. నౌకలోని సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ప్రస్తుతానికి ట్యాంకర్ నుంచి చమురు లీక్ కావడం లేదని పేర్కొంది.
అంతకుముందు తమ భూభాగంపై డ్రోన్ దాడి జరిగిందని బహ్రెయిన్ ఆరోపించింది. ఇరాన్ అనేక డ్రోన్లతో తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుందని మండిపడింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో ప్లీట్ ప్రధాన కార్యాలయం ఉంది. మరోవైపు, ఈనెల 25న హర్మూజ్ జలసంధిలో ఓ కార్గో నౌకపై ఇరాన్ డ్రోన్ దాడికి ప్రతీకారంగా అగ్రరాజ్యం శుక్రవారం రాత్రి టెహ్రాన్పై వైమానిక దాడులు చేపట్టింది. ఇరాన్ సైనిక స్థావరాలను, క్షిపణి-డ్రోన్ల నిల్వ ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది.
అవగాహన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ హర్మూజ్లో ఇరాన్ దాడి చేపట్టడంతో తాము ప్రతిదాడి చేపట్టామని అమెరికా తెలిపింది. వెంటనే ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేపట్టింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్, క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ పేర్కొంది. మళ్లీ ఘర్షణలు తలెత్తితే అమెరికా భారీ ప్రాణనష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని ఇరాన్ సుప్రీం లీడర్ సైనిక సలహాదారు మొహ్సేన్ రెజాయ్ తీవ్ర హెచ్చరిక చేశారు.
మరోవైపు హర్మూజ్ జలసంధిలో ఒమన్ ఓ తాత్కాలిక రవాణా నడవాను ప్రతిపాదించింది. హర్మూజ్లోనే ఒమన్ తీరానికి దగ్గరగా ఈ మార్గం ఉంది. దీనిలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ పర్యవేక్షణ ఉండదని ఒమన్ తెలిపింది. నౌకల రాకపోకలు సాఫీగా సాగేందుకు వీలుగా ఈ మార్గాన్ని విస్తరిస్తున్నట్లు అమెరికా నౌకాదళ పర్యవేక్షణలోని జాయింట్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ తెలిపింది.

More Stories
భారత్ కు ఆందోళన కలిగిస్తున్న చైనా చేతికి మోంగ్లా పోర్టు
అఫ్గనిస్థాన్, జపాన్ లలో భారీ భూకంపాలు
షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గాం దాడి సూత్రధారి