మెట్రో రైల్ ఫేజ్ -2పై రైల్వే మంత్రితో రేవంత్, కిషన్ భేటీ 

మెట్రో రైల్ ఫేజ్ -2పై రైల్వే మంత్రితో రేవంత్, కిషన్ భేటీ 
తెలంగాణ అభివృద్ధి, ముఖ్యంగా భాగ్యనగర జీవనాడి అయి న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ -2 ప్రాజెక్టు చుట్టూ సాగిన పొలిటికల్ హైడ్రామాకు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అనూహ్యమైన ముగింపు లభించింది. నిన్నమొన్నటి వరకు మెట్రో నిధుల విషయంలో పరస్పరం తీవ్ర విమర్శలు, సవాళ్తతో విసురుకుపడిన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి రాజకీయ విభేదాలను పక్కనబెట్టి చివరకు ఒక్కటిగా వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఆదివారం రాత్రి కలిశారు.
 
ఈ అరుదైన భేటీ వెనుక పెద్ద రాజకీయం యుద్ధమే నడిచింది. సోమవారం రాత్రి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో దాదాపు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశం అపాయింట్మెంట్‌ కూడా సికింద్రాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డే తీసుకున్నారు.మెట్రో రుణం బదిలీ, రెండో దశ విస్తరణ.. ఈ రెండు అంశాలపై ఇద్దరు నేతలు మంగళవారం పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సమావేశం కానున్నారు. 
 
మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు సమావేశం ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశను స్వాధీనం చేసుకోవడంలో కీలకమైన కొత్త రుణం మంజూరుపై మంగళవారం సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. 
 
హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆపేశారని, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎఫ్‌సీ) ఖాతాలో జమయిన రూ.13,600 కోట్లను రాష్ట్రప్రభుత్వానికి ఇవ్వకుండా నిలిపివేయించారని గత వారం సీఎం రేవంత్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రాజెక్టులను ఆపే సంస్కృతి బీజేపీకి లేదని, కేంద్ర మంత్రులతో సీఎ రేవంత్‌ భేటీకి తాను కూడా వస్తానని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. 
 
ఈ నేపథ్యంలో మెట్రో అంశంపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ రెండుసార్లు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులను కలిసేందుకు ముఖ్యమంత్రి ఆదివారం రాత్రి ఢిల్లీకి రాగా, కిషన్‌రెడ్డి రైల్వే మంత్రి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు.  కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సానుకూల చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
రైల్వే శాఖ మంత్రితో బేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రోకు ఐఆర్‌ఎఫ్‌సి నుంచి రుణం విషయమై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా సాగాయని చెప్పారు. ఈ అంశంపై కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంగళవారం ఉదయం భేటీ అవుతామని సిఎం వెల్లడించారు. 
 
అంతకు ముందు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన రక్షణభూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ సమగ్రత, రక్షణకు సంబంధించిన అంశమైనందువల్ల ఆదిలాబాద్‌లో వాయుసేన విమానాశ్రయానికి సహకరిస్తామని రక్షణ మంత్రి హామీ ఇచ్చారు.  వాయుసేన టెర్మినల్‌తోపాటు కార్గో, హ్యాంగర్‌, ఎమ్‌ఆర్‌వో సౌకర్యాలు కల్పించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హ్యాంగర్స్‌ ఏర్పాటుకు ఆదిలాబాద్‌ విమానాశ్రయం అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దేవరకద్ర సమీపంలో డీఆర్‌డీవో ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని ఆయన కోరారు.