విరాళాల దుమారంపై సీఎం యోగికి సిట్ ప్రాథమిక నివేదిక

విరాళాల దుమారంపై సీఎం యోగికి సిట్ ప్రాథమిక నివేదిక
* విరాళాల నిర్వహణలో వ్యవస్థాగత లోపాలను ప్రస్తావించిన సిట్?
అయోధ్యలోని రామమందిరానికి వచ్చిన విరాళాలలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఆదివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి తమ ప్రాథమిక దర్యాప్తు నివేదికను సమర్పించింది. ఆరు రోజుల పాటు దాదాపు అరవై గంటల పాటు అయోధ్య రామమందిరంలో జరిపిన దర్యాప్తు వివరాలను సిట్ ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. 
ఈ రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల్ని దారి మళ్లించడం, దేవాలయ ట్రస్ట్ అకౌంట్‌లో జమ చేయకపోవడం వంటి అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారించేందుకు సిట్ ఏర్పాటు చేశారు. ఈ ఆరు రోజుల సుదీర్ఘ దర్యాప్తు ప్రక్రియలో, బృందం 60 గంటలకు పైగా విచారణ జరిపి, 150 మందికి పైగా అనుమానితులను ప్రశ్నించింది.

కోట్ల రూపాయల విలువైన విరాళాలకు సంబంధించిన ఈ కేసులో సిట్ సేకరించిన ఆధారాలు ఏమిటి? తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? అనే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. శ్రీరామ జన్మభూమి మందిర ట్రస్ట్ అభ్యర్థన మేరకు, ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ ని ఏర్పాటు చేసింది.
ఈ బృందంలో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ (రేంజ్) కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. వీలైనంత త్వరగా ప్రాథమిక, తుది నివేదికలను సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి సమర్పించిన ప్రాథమిక నివేదికలో, అయోధ్య రామమందిరంలో విరాళాల నిర్వహణకు సంబంధించి వ్యవస్థాగత లోపాలు ఉన్నాయని సిట్ గుర్తించినట్లు సమాచారం. 
 
విరాళాల పెట్టెల నుండి నగదు, బంగారం, వెండి ఆభరణాలను తీయడం, వాటిని లెక్కింపు కేంద్రానికి తరలించడం , లెక్కింపు ప్రక్రియను నిర్వహించడంలో లోపాలను సిట్ గమనించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత వ్యవస్థలో గణనీయమైన మెరుగుదలలు, కఠినమైన పర్యవేక్షణ అవసరమని నివేదిక పేర్కొంది. విరాళాల సొమ్మును బ్యాంకులకు తరలించే విధానంలో కూడా లోపాలను సిట్ గుర్తించిందని సమాచారం.
 
నిర్దేశించిన నిబంధనల ప్రకారం, నగదును ‘డబుల్-లాక్’ (రెండు తాళాలు ఉండే) వ్యవస్థలో భద్రపరచాలి. ఆ రెండు తాళాల తాళంచెవులు వేర్వేరు వ్యక్తుల వద్ద ఉండాలి. అయితే, ఈ విధానాన్ని సరిగ్గా పాటించడం లేదని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ప్రాథమిక నివేదికలో ఆలయ ట్రస్ట్‌కు చెందిన ఏ సీనియర్ బాధ్యుల పేర్లూ ప్రస్తావించలేదు. అయితే, ట్రస్ట్ ఉద్యోగులు, ఎస్‌బీఐ సిబ్బంది, నగదు లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న ప్రైవేట్ సంస్థల సిబ్బందికి సంబంధించిన అక్రమాలను ఇది ఎత్తిచూపినట్లు సమాచారం.
 
గవర్నర్‌తో ముందే నిర్ణయించిన సమావేశానికి వెళ్లాల్సి ఉన్నందున, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సిట్ సమావేశం క్లుప్తంగా జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు సమర్పించిన నివేదిక కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. 15 రోజుల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాల్సిన బాధ్యతను సిట్ కి అప్పగించారు. అయోధ్యను విడిచి వెళ్లవద్దని ట్రస్ట్ అధికారులు, ఆలయ సిబ్బందిని ఆదేశించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
 
బంగారం, వెండి మరియు విలువైన రాళ్లతో సహా సమర్పించిన కానుకలకు సంబంధించిన రికార్డులలో వ్యత్యాసాలను దర్యాప్తు అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదివారం లక్నోకు బయలుదేరే ముందు, ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ ఆదేశాలను జారీ చేసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 
 
రామమందిర ప్రాంగణంలో మొత్తం 35 విరాళాల పెట్టెలు ఏర్పాటు చేశారన్న విషయం గమనార్హం. వీటిని రోజుకు రెండుసార్లు తెరుస్తారు. ఈ సమయంలో ట్రస్ట్ మరియు బ్యాంకుకు చెందిన నలుగురు ఉద్యోగులు అక్కడ ఉంటారు. విరాళాల లెక్కింపు ప్రక్రియ రెండు షిఫ్టులలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 8 గంటలకు మొదలై మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది.
 
రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఒక్కో షిఫ్టులో సుమారు 20 మంది పనిచేస్తారు. రామమందిరం నుండి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న ‘యాత్రి సువిధా కేంద్రం’ (యాత్రికుల సౌకర్య కేంద్రం) బేస్‌మెంట్‌లో ఈ కానుకలను లెక్కిస్తారు. లెక్కింపు గది పక్కనే అనిల్ మిశ్రా క్యాబిన్ ఉంటుంది. అనిల్ మిశ్రాను కూడా సిట్ విచారించింది.
 
కానుకల చోరీ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిట్ ఇప్పటివరకు 150 మందిని విచారించింది. ఈ వ్యవహారంలో 25 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులపై జిల్లా దాటి వెళ్లడంపై ఆంక్షలు విధించారు. కానుకల చోరీ ఆరోపణల కేసులో పేర్లు ఉన్న ఉద్యోగులు కూడా అయోధ్య దాటి వెళ్లకూడదని ఆదేశించారు.