యూపీలో కరుడుగట్టిన క్రిమినల్ బబ్లూ హతం

యూపీలో కరుడుగట్టిన క్రిమినల్ బబ్లూ హతం
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌‌లో కరుడుగట్టిన క్రిమినల్ హతమయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అయోధ్యలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో భాను ప్రతాప్ సింగ్ అలియాస్ బబ్లూ హతమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) సిబ్బంది కలిసి ఆపరేషన్ నిర్వహించారు. 
 
హతుడు భాను ప్రతాప్ సింగ్‌పై అనేక జిల్లాల్లో 40 వరకు కేసులున్నాయి. అతడిపై అనేక చోట్లా రూ 2 లక్షల వరకు రివార్డ్ కూడా ఉంది. గోరక్‌పూర్ పరిదిలోని బిక్నిపూర్ గ్రామానికి చెందిన బబ్లూ అనేక నేరాలకు పాల్పడ్డాడు. కొంతకాలంగా అతడు పరారీలో ఉన్నాడు. అతడి గురించి ఇటీవల ఎస్టీఎఫ్ అధికారులకు సమాచారం అందింది.  దీంతో యూపీ పోలీసులతో కలిసి బబ్లూ ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టారు. 
 
ఇది గమనించిన బబ్లూ పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో పోలీసులు కూడా అతడిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భాను ప్రతాప్ సింగ్ అలియాస్ బబ్లూకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మరణించాడు. ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. వారికి కూడా అధికారులు చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, యూపీలోని ఘాజీపూర్‌‌లో కూడా మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇటీవల ఒక వ్యాపారిని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. అతడిని పట్టుకునే క్రమంలో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరించేలోపే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.