బాల్క సుమన్‌పై దేశద్రోహం కేసు

బాల్క సుమన్‌పై దేశద్రోహం కేసు
సింగరేణి కార్యాలయాలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ‌‌పై పోలీసులు నమోదు చేసిన కేసులో దేశద్రోహం సెక్షన్‌ కూడా ఉండడం కలకలం రేపుతోంది. తెలంగాణ భవన్‌లో ఉన్న బాల్క సుమన్‌ను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసిన నాంపల్లి పోలీసులు ఆరున్నర గంటల పాటు విచారణ జరిపారు. 
 
ఆ తర్వాత శనివారం రాత్రి నాంపల్లి మేజిస్ట్రేట్ చందన ఎదుట పరిచిన పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాంపల్లి కోర్టులో బాల్క సుమన్ అరెస్ట్, అతడిపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై విచారణ జరిగింది.  అయితే ఈ వ్యవహారంలో బాల్క సుమన్‌పై మొత్తం 3 సెక్షన్లు నమోదు చేశారు. 
పేలుడు పదార్థాలు ఉపయోగించడం, ప్రజా ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రార్థనాలయాలను ధ్వంసం చేయడం, వంటి నేరాలకు పెట్టే బీఎన్‌ఎస్‌ 326 (జీ)ని కూడా నమోదుచేశారు. ఇవన్నీ అత్యంత నేరపూరితమైన చర్యలకు నమోదు చేసే సెక్షన్లు. వీటిలో పీడీపీపీ యాక్ట్‌ కింద కేసు పెడితే ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు వినిపించాల్సి ఉంటుంది. 
 
ఇవన్నీ కనీసం ఐదు నుంచి పదేండ్ల జైలు శిక్షపడే అవకాశం ఉన్న నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లు. ఇంతటి కఠిన సెక్షన్లు పెట్టడం సరికాదని బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫు న్యాయవాది జక్కుల లక్ష్మణ్‌ తదితరులు శనివారం అర్ధరాత్రే న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు దేశంలోని పలు రాష్ర్టాల్లో ఇదే తరహా కేసులు, బెయిల్‌ ఇచ్చే అవకాశాలు వంటివాటిని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
 
అయితే, రిమాండ్‌ సందర్భంగానే రిజెక్షన్‌ మెమో కూడా బాల్కసుమన్‌ తరఫు న్యాయవాదులు దాఖలు చేశారు. వీటిపై న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బాల్కసుమన్‌పై పెట్టిన పీడీపీపీ యాక్ట్‌ రెడ్‌ విత్‌ 55, 61(2)తో పాటు సెక్షన్‌ 326(జీ), 351(3) బీఎన్‌ఎస్‌ సెక్షన్లను తొలగించాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో 2 సెక్షన్లు మాత్రమే బాల్క సుమన్‌కు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది.
ఈ క్రమంలోనే బాల్క సుమన్‌పై నమోదు చేసిన మిగిలిన సెక్షన్లను కోర్టు రద్దు చేసింది.  దీంతో పోలీసులు దేశ సమగ్రత దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని రాజద్రోహం సెక్షన్ 152ను కూడా రేమండ్ రిపోర్టులో పోలీసులు జోడించారు.