జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ భార్య దారుణ హత్య

జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ భార్య దారుణ హత్య

* డబ్బు కోసం నేపాలీ పని మనిషి ఘాతుకం!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లో విశ్రాంత ఐపీఎస్‌ వినయ్‌ రంజన్‌రే భార్య తనూజా దారుణ హత్యకు గురయ్యారు. ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు, నేపాల్​కు చెందిన కల్పన అనే పనిమనిషి డబ్బు కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. వినయ్​ రంజన్​రే నివాసంలో పనిచేస్తున్న నేపాల్​కి చెందిన పనిమనిషి కల్పన ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 

రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ వ్యక్తిగత పనిపై బెంగళూరు వెళ్లడంతో తనూజ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అదే నిందితులకు అవకాశంగా మారింది. పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, అర్థరాత్రి 1 గంట సమయంలో నిందితులు ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న తనూజ నోట్లో గుడ్డలు కుక్కి, ఊపిరాడకుండా చేసి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. 

అనంతరం ఇంట్లో ఉన్న భారీగా బంగారం, నగదు దోచుకుని మాయమయ్యారు. ఉదయం పరిసరాల్లో అనుమానాస్పద కదలికలు గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఆ ఇంట్లో గత ఎనిమిది నెలలుగా పనిమనిషిగా ఉన్న కల్పన. యజమాని ఒంటరిగా ఉన్న సమయం చూసి, తన నేపాలీ ముఠా సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కేవలం దోపిడీ కోసమే కాదు, పక్కా స్కెచ్‌తో ఈ హత్యకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ సాక్ష్యాలు చెబుతున్నాయి. కల్పనతో పాటు మరో ముగ్గురు సభ్యులు ఈ నేరంలో పాల్గొన్నట్లు సీపీ సజ్జనార్ ధృవీకరించారు.  ఘటనా స్థలానికి డీజీపీ సీవీ ఆనంద్, కమిషనర్ సజ్జనార్ సహా ఇతర ఉన్నతాధికారులు చేరుకుని పరిశీలించారు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

“తెల్లవారిజామున మాజీ ఐపీఎస్​ అధికారి భార్య తనూజాను హత్య చేశారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. నేపాలీ పనిమనిషులతో అప్రమత్తంగా ఉండాలి. వారిపై పక్కా నిఘా ఉంచాలి. ఇంట్లో పని మనుషులు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. బెంగళూరు, ముంబయి, పుణెలో ఈ నేపాలీ ముఠా నేరాలకు పాల్పడుతున్నారు” అని సజ్జనార్ తెలిపారు. 

ఇటీవల రిటైర్డ్ డీజీ తల్లి మరణించారని, అప్పటి నుంచి మృతురాలు తనూజ ఇఘటన క్కడే ఉంటున్నారని ఆయన చెప్పారు. ఆ సమయంలో పిల్లలు ఇద్దరు పై ఫ్లోర్‌లో ఉన్నారని, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నారని వెల్లడించారు. నేపాలి పనిమనుషులు ఇంట్లో ఏడాది, రెండో ఏడాది పనిచేసిన కూడా వాళ్లపై నిఘా ఉంచాలని హెచ్చరించారు.