సీపీఎంలోని బంధుప్రీతి, అవినీతిలను బహిర్గతం చేసిన రెబెల్స్!

సీపీఎంలోని బంధుప్రీతి, అవినీతిలను బహిర్గతం చేసిన రెబెల్స్!
* ముగ్గురు రెబెల్ అభ్యర్థుల గెలుపు 
 
సీపీఎంలోని బంధుప్రీతి, ఆర్థిక అవకతవకలు, నేరమయ రాజకీయాలకు వ్యతిరేకంగా కార్యకర్తలలో చెలరేగుతున్న అలజడికి, అంబలపుళా నియోజకవర్గం జి. సుధాకరన్, తాలిపరంబ నియోజకవర్గం టి.కె. గోవిందన్, పయ్యన్నూర్ నియోజకవర్గం వి. కున్హికృష్ణన్ చేసిన అపూర్వమైన పోరాటానికి ప్రతీకగా నిలిచారు.  అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీతో విభేదించి, యూడీఎఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన ముగ్గురు కేరళలోని సిపిఎం కంచుకోటల్లో భారీ సంచలనాలను సృష్టించారు.
 
1967లో ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి పయ్యన్నూర్ అసెంబ్లీ స్థానాన్ని సీపీఎం  గెలుచుకొంటూ వస్తున్నది. అయితే, తొలిసారిగా తిరుగుబాటు నాయకుడు వి. కున్హికృష్ణన్ చేతిలో కోల్పోయింది. ఆయన సీపీఎం సిట్టింగ్ శాసనసభ్యుడు టి.ఐ. మధుసూదనన్‌ను 7,487 ఓట్ల తేడాతో ఓడించారు. 
 
“నేను పార్టీలోని పోరాటంలో భాగంగా పోటీ చేశాను. పార్టీ నాయకత్వాన్ని ప్రజలు సరిదిద్దాలని నేను కోరుకున్నాను. ప్రజలు, కార్యకర్తలు సీపీఎంను సరిదిద్దారని ఈ తీర్పు చూపిస్తుంది. అంతేకాకుండా, యూడీఎఫ్ కూడా నాకు మద్దతు ఇవ్వడంతో నా విజయం సాధ్యమైంది. సీపీఎం పతనాన్ని అంతం చేయాలని నేను కోరుకున్నాను,” అని కున్హికృష్ణన్ తెలిపారు. 
 
రాజకీయ హింసలో మరణించిన ఒక కార్యకర్త కుటుంబం కోసం సేకరించిన నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై కన్నూర్‌లోని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు, 74 ఏళ్ల కున్హికృష్ణన్ తిరుగుబాటు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదనన్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, కున్హికృష్ణన్‌కు వివిధ వర్గాల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఆయన మద్దతుదారుల ఇళ్లపై దాడులు జరిగాయి. నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొన్న మధుసూదనన్‌కు సీపీఎం తన మద్దతును ప్రకటించింది. 
 
సమీపంలోని తాలిపరంబ నియోజకవర్గంలో, మరో తిరుగుబాటుదారుడు టి.కె. గోవిందన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ భార్య అయిన పి.కె. శ్యామలను ఓడించేందుకు సిద్ధపడ్డారు. రాష్ట్ర కార్యదర్శి 2021 నుంచి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఆయన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో, ఈ స్థానాన్ని ఆయన భార్య, అంథూర్ మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ అయిన శ్యామలకు కేటాయించారు. 
 
పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నాయకుడు గోవిందన్, ఆ నియోజకవర్గాన్ని రాష్ట్ర కార్యదర్శి కుటుంబ కంచుకోటగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికలలో పోటీ చేశారు. ఈ సవాలు కారణంగా, తన భార్య ప్రతిష్టాత్మక పోరాటాన్ని పర్యవేక్షించడానికి గోవిందన్ నియోజకవర్గంలోనే ఉండవలసి వచ్చింది.  అయితే, 17 రౌండ్ల ఓట్ల లెక్కింపులో 12 రౌండ్లు పూర్తయ్యాక, టి.కె. గోవిందన్ 10,069 ఓట్ల ఆధిక్యంతో పార్టీని ఆశ్చర్యపరిచారు. 
ఈ నియోజకవర్గంలో, కేరళలో సిపిఎంకి తిరుగులేని కంచుకోటలుగా ప్రసిద్ధి చెందిన అనేక గ్రామాలు ఉన్నాయి. తాలిపరంబ నియోజకవర్గంలో 1977 నుండి ఇప్పటివరకు ఆ పార్టీకి ఓటమే ఎదురుకాలేదు.  రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సుధాకరన్, గతంలో కూడా అంబలపుళ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. పార్టీని వీడుతూ ఆయన, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజలకు దూరమయ్యారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, అలప్పుళ జిల్లాలో ఒక నేర ముఠా పార్టీపై పట్టు సాధించిందని కూడా ఆయన ఆరోపించారు.