యూఏఈ ఏఐ సాయంతో సగం ప్రభుత్వ సేవలు

యూఏఈ ఏఐ సాయంతో సగం ప్రభుత్వ సేవలు
ఆధునికతను అందిపుచ్చుకోవడంలో ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉండే యూఏఈ ఏఐ సాయంతో సగం ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే ప్రాజెక్ట్‌ చేపట్టింది. అధ్యక్షుడు షేక్‌ మొహ్మమద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఆదేశాల మేరకు రానున్న రెండేండ్లలో యూఏఈ ప్రభుత్వ రంగాలు, సేవలు, కార్యకలాపాలను సగం మేరకు స్వయం ప్రతిపత్తి గల కృత్రిమ మేధ(ఏఐ) వ్యవస్థలుగా మార్చనున్నారు. 
 
ఈ కీలక మార్పును యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్‌ పాలకుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ప్రకటించారు. వచ్చే రెండేండ్లలో ప్రభుత్వ సేవల్లో 50 శాతాన్ని స్వయం ప్రతిపత్తి గల ఏఐకి బదిలీ చేయనున్నట్లు ఎక్స్‌ పోస్టులో ఆయన తెలిపారు.  పనులను స్వతంత్రంగా నిర్వహించడం, ప్రక్రియలను నిర్వహించడం, నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటం వంటి సామర్థ్యం గల ఏజెంటిక్‌ ఏఐ నమూనాలను స్వీకరించిన ప్రపంచంలోనే  మొదటి దేశంగా యూఏఈని నిలపడమే ఈ ప్రణాళిక లక్ష్యమని ఆయన చెప్పారు. 
 
“నేడు, ఏఐ నమూనాలు మార్పులను పర్యవేక్షించగలవు, విశ్లేషణలు అందించగలవు, సిఫార్సులు ఇవ్వగలవు, కార్యకలాపాలను నిర్వహించగలవు. మానవ ప్రమేయం లేకుండా స్వతంత్రంగా అనేక చర్యలను చేపట్టగలవు. నిర్ణయాలకు మద్దతు ఇవ్వడానికి, సేవలను మెరుగుపరచడానికి, కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచడానికి, ఫలితాలను మూల్యాంకనం చేయడానికి, నిజ సమయంలో మెరుగుదలలను ప్రవేశపెట్టడానికి కూడా ఏఐ మన ప్రభుత్వ కార్యనిర్వాహక భాగస్వామిగా ఉంటుంది,” అని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు.
 
మార్పులకు అనుగుణంగా మందుకు సాగేవారి సామర్థ్యం ఆధారంగా రానున్న రెండేండ్లలో మంత్రులు, డైరెక్టర్‌ జనరళ్లు, ప్రభుత్వ సంస్థలను అంచనా వేయడం జరుగుతుందని షేక్‌ మహమ్మద్‌ చెప్పారు. ఇందులో భాగంగా వారు కొత్త ప్రమాణాలను ఎంత వేగంగా అమలు చేస్తారు, ప్రభుత్వ కార్యకలాపాలను పునర్‌ నిర్మించడానికి ఏఐ సాధనాలను ఎంత త్వరగా స్వీకరిస్తారు అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు.
 
నిరంతర, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ద్వారా ఏఐ సాధనాలపై పట్టు సాధించడంలో ప్రభుత్వం ఉద్యోగులందరికీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. “దీని ఫలితంగా, కృత్రిమ మేధస్సు సాంకేతికతల దిశగా సాగే ప్రభుత్వ పరివర్తన ప్రక్రియలో, ప్రపంచంలోనే అత్యుత్తమ నిపుణులు మనకు లభిస్తారు,” అని ఆయన చెప్పారు.  2017లో, కృత్రిమ మేధస్సు  కోసం ఒక సహాయ మంత్రిని నియమించిన మొట్టమొదటి దేశంగా  యూఏఈ  నిలిచింది; అంతేకాకుండా, ‘ యూఏఈ  శతాబ్ది 2071′ దార్శనికతలో భాగంగా ‘ యూఏఈ  కృత్రిమ మేధస్సు వ్యూహం 2031’ని ప్రారంభించింది.