నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది సీట్లు తగ్గవు 

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది సీట్లు తగ్గవు 
నియోజకవర్గాల పునర్విభజనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ .  దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణాదిలో జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయని తెలిపారు.
 
“నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయని కొందరు పూర్తిగా అవాస్తవమైన ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీని వల్ల దక్షిణాదిలో వాస్తవానికి సీట్ల సంఖ్య పెరుగుతుంది. తద్వారా ఆ రాష్ట్రాల రాజకీయ బలం పెరుగుతుంది. ఐదు దక్షిణ రాష్ట్రాలలో (ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ) ప్రస్తుతం 129 ఎంపీ స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఆ లోక్‌సభ స్థానాల సంఖ్య 195కు పెరుగుతుంది” అని తెలిపారు. 
 
“అంటే మొత్తం ఎంపీలలో దక్షిణాది రాష్ట్రాల ఎంపీల శాతం 23.76 శాతం నుంచి 23.87 శాతానికి పెరుగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఇది మొత్తం సీట్లలో 3.13 శాతం. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం తర్వాత తెలంగాణ ఎంపీల సంఖ్య 26కి పెరుగుతుంది. అంటే మొత్తం ఎంపీల్లో తెలంగాణ 3.18 శాతంగా ఉంటుంది. డీలిమిటేషన్ తర్వాత కర్ణాటకలో లోక్‌సభ సీట్లు 28 నుంచి 42కు పెరుగుతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కు, తమిళనాడులో 39 నుంచి 59కు, కేరళలో 20 నుంచి 30కు ఎంపీ సీట్లు పెరుగుతాయి” అని అమిత్ షా వివరించారు. 

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో ప్రభుత్వం కుట్రకు పాల్పడుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. డీలిమిటేషన్ బిల్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని యథాతథంగా పోలిఉందని స్పష్టం చేశారు. ఇందులో తాము ఎటువంటి మార్పులు చేయలేదని,కనీసం ఒక కామా గానీ, ఫుల్‌స్టాప్ గానీ మార్చలేదని స్పష్టం చేశారు. 

డీలిమిటేషన్ వల్ల ప్రస్తుతం ఉన్న ఎంపీ స్థానాలు మరో 50 శాతం పెరుగుతాయని వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం ఎలా జరుగుతుందో విపక్ష ఎంపీలు చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాలు అసత్యాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. మొత్తం సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వ్‌ అవుతాయని, జనరల్‌ స్థానాల్లోనూ నారీమణులకు అవకాశం ఇస్తే చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని చెప్పారు.

“దేశంలో గతంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పటికీ ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడం సాధ్యం కాలేదు. ఇది భారతదేశ చరిత్ర. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే శక్తి ఎవరికీ లేదు. అలా చేయడానికి ప్రయత్నించిన వారు తగిన పర్యావసానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది” అని హెచ్చరించారు. 

అత్యవసర పరిస్థితి సమయంలో దేశ ప్రజలు వారిని (కాంగ్రెస్‌ను) ఓడించారని, ప్రజాస్వామ్యానికి ఎటువంటి హానీ జరగలేదని గుర్తు చేశారు. “తమిళనాడు, బంగాల్‌లలో ఎన్నికలు జరగబోతున్నాయని, ఈ తరుణంలో ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చారని మాపై ప్రచారం జరుగుతోంది. ఇది సరికాదు. డీలిమిటేషన్ కమిషన్ (నియోజకవర్గాల పునర్విభజన సంఘం) నివేదికను పార్లమెంట్ ఆమోదించి, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినప్పుడు మాత్రమే అది అమల్లోకి వస్తుంది” అని తెలిపారు. 

కాబట్టి 2029కి ముందే దీనిని అమలు చేసే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. 2029 వరకు జరిగే ఎన్నికలు కూడా ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం, నియోజకవర్గాల ప్రకారమే జరుగుతాయి కాబట్టి అఖిలేశ్ యాదవ్ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని హితవు చెప్పారు. “రాజకీయ నాయకులైనా, పార్టీలైనా 130 కోట్ల మంది ప్రజల తీర్పును తారుమారు చేయలేరు. ఒకవేళ మేము అలా చేసి ఉంటే ఎన్నికల్లో ఎప్పుడూ గెలిచేవాళ్లమే కాదు” అని అమిత్ షా స్పష్టం చేశారు.