ఫిడే మహిళల క్యాండిడేట్స్‌ టోర్నీ విజేతగా వైశాలి

ఫిడే మహిళల క్యాండిడేట్స్‌ టోర్నీ విజేతగా వైశాలి
 

ఫిడే మహిళల క్యాండిడేట్స్‌ టోర్నీ విజేతగా నిలిచిన ఆర్‌. వైశాలి తొలి భారతీయురాలిగా నయా చరిత్రను లిఖించింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కు చెందిన ఒక మహిళా గ్రాండ్‌మాస్టర్‌ విజేతగా నిలవడం ఇదే తొలిసారి. బుధవారం రాత్రి జరిగిన 14వ, ఫైనల్‌ రౌండ్‌లో కాటెరీనా లాగ్నో(ఉక్రెయిన్‌)ను ఓడించిన వైశాలి ఫిడే మహిళల క్యాండిడేట్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.  దీంతో ఈ ఏడాది చివర్లో జరిగే మహిళల ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం జూ వెన్‌జున్‌(చైనా)తో తలపడనుంది. 

మహిళల ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం పోటీపడే రెండవ భారతీయ మహిళ వైశాలి. అంతేకాకుండా, గత 15 ఏళ్లలో ఈ ఘనత సాధించిన తొలి మహిళ కూడా ఆమే. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళ కోనేరు హంపి.15 ఏళ్ల క్రితం, అంటే 2011లో అల్బేనియాలోని టిరానాలో జరిగిన పోటీలో ఆమె హౌ యిఫాన్‌ను మహిళల ప్రపంచ టైటిల్ కోసం సవాలు చేసిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. అయితే, 
2011లో, ఫిడే గ్రాండ్ ప్రిక్స్ సిరీస్‌లో అగ్రస్థానంలో నిలిచిన తర్వాత కోనేరు హంపి ఈ టైటిల్ పోరుకు అర్హత సాధించింది.  అల్బేనియాలోని టిరానాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో హంపి, చైనాకు చెందిన ప్రస్తుత ఛాంపియన్ హౌ యిఫాన్‌తో తలపడింది. ఎనిమిది గేమ్‌ల పాటు జరిగిన ఈ టైలో, చైనాకు చెందిన ఈ గ్రాండ్‌మాస్టర్ 5.5-2.5 తేడాతో ఆధిపత్యం చెలాయించి, తన టైటిల్‌ను నిలబెట్టుకుంది.
 
క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో సాధించిన విజయం, గత మూడేళ్లలో వైశాలి గెలిచిన మూడవ పెద్ద టోర్నమెంట్. ఈ 24 ఏళ్ల క్రీడాకారిణి ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్‌ను రెండుసార్లు గెలుచుకుంది మరియు 2024లో జరిగిన మహిళల ఒలింపియాడ్ విజయంలో కూడా భాగమైంది. క్యాండిడేట్స్ గెలిచిన తర్వాత ఎదుర్కొన్న కష్టకాలం గురించి మరియు తాను ఎలా పుంజుకుందో ఆర్. వైశాలి గుర్తుచేసుకుంది.
 
 “గడిచిన రెండేళ్లు నాకు అంత మంచిగా గడవలేదు. నా రేటింగ్ చాలా పడిపోయింది. ఒక టోర్నమెంట్ తప్ప, మిగతావన్నీ నాకు ప్రతికూలంగానే సాగాయి. కానీ నేను నా అత్యుత్తమ ఫామ్‌లో ఉంటే, వారందరితో సమానంగా పోటీపడగలనని నాకు తెలుసు,” అని ఆమె విలేకరుల సమావేశంలో చెప్పింది.
 
1952లో తొలిసారి మహిళల క్యాండిడేట్స్‌ టోర్నీ ప్రారంభం కాగా, 1997వరకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత టోర్నీగా మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత మ్యాచ్‌ ఫార్మాట్‌ స్థానంలో నాకౌట్‌ టోర్నమెంట్‌లో వచ్చాయి. మహిళల ప్రపంచ ఛాంపియన్‌ విజేతను తేల్చడానికి ఫిడే మ్యాచ్‌ ఫార్మాట్‌ను పునరుద్ధరించిన తర్వాత 2019లో క్యాండిడేట్స్‌ టోర్నీ తిరిగి ప్రారంభమైంది. 
 
ఈ టోర్నీలో రష్యా గ్రాండ్‌మాస్టర్లదే హవా. 1952నుంచి 1988వరకు ఏకచక్రాధిపత్యం చెలాయించిన రష్యా గ్రాండ్‌మాస్టర్లకు తొలిసారి చైనా గ్రాండ్‌మాస్టర్లు చెక్‌ పెట్టారు. 1990లో షీ జుంగ్‌ రష్యా గ్రాండ్‌మాస్టర్ల రికార్డుకు బ్రేక్‌ వేయగా ఆ తర్వాత 1992లో జార్జియా 1994లో హాంగేరీ గ్రాండ్‌మాస్టర్లు టైటిల్‌ విజేతలుగా నిలిచారు.  1998 నుంచి 2021 వరకు ఈ టోర్నీని రద్దు చేయగా తిరిగి 2022 నుంచి మహిళల క్యాండిడేట్స్‌ టోర్నీ పునరుద్ధరించబడింది. 2022, 2024లో చైనా మహిళా గ్రాండ్‌మాస్టర్లు విజేతలుగా నిలువగా, 2026లో అంచనాలకు మించి రాణించి రమేష్‌బాబు వైశాలి విజేతగా నిలిచి త్రివర్ణ పతకాన్ని ప్రపంచపటంలో లిఖించింది.