రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల మినహాయింపును రద్దు చేసిన అమెరికా

రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల మినహాయింపును రద్దు చేసిన అమెరికా
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో రష్యా, ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేయడానికి భారత్ వంటి దేశాలకు ఇప్పటి వరకు ఉన్న ఆంక్షల మినహాయింపును ఇకపై పొడిగించబోమని అమెరికా తేల్చిచెప్పింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్ సహా పలు దేశాలపై తీవ్ర ప్రభావం పడబోతుంది.  అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మీడియాతో మాట్లాడుతూ రష్యా, ఇరాన్ చమురుపై ఉన్న జనరల్ లైసెన్స్‌లను పునరుద్ధరించడం లేదని స్పష్టం చేశారు. 
 
మార్చి 11 కంటే ముందు ఓడల్లో లోడ్ చేసిన చమురును మాత్రమే విక్రయించుకోవడానికి అనుమతి ఇచ్చామని, ఆ నిల్వలు ఇప్పటికే పూర్తి అయ్యాయని ఆయన వెల్లడించారు. ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  హార్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. 
 
దీంతో రష్యా, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసుకోవచ్చంటూ మినహాయింపును కల్పించింది. యూఎస్ ఇచ్చిన ఈ మినహాయింపులు భారత్‌కు కొండంత అండగా నిలవగా, భారత్ ఇరాన్, రష్యా వద్ద తనకు కావాల్సినంత చమురు కొనుగోలు చేసుకుంది. ఈ మినహాయింపు కాలంలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి సుమారు 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేశాయి. 
 
దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత రెండు భారీ ట్యాంకర్ల ఇరాన్ చమురు భారత తీరానికి చేరింది. ఒకప్పుడు భారత్ మొత్తం దిగుమతుల్లో ఇరాన్ వాటా 11.5 శాతంగా ఉండేది. అయితే తాజా నిర్ణయంతో చౌకగా లభించే ఈ చమురు దిగుమతులకు బ్రేక్ పడనుంది. ఈ ఆంక్షల మినహాయింపులపై అమెరికాలో ప్రతిపక్ష డెమొక్రాట్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు వల్ల రష్యాకు రోజుకు 150 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతోందని, అది ఉక్రెయిన్ యుద్ధానికి ఉపయోగపడుతోందని సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ విమర్శించారు. రష్యా, ఇరాన్ వంటి దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయాల్సిన సమయంలో ఇలాంటి మినహాయింపులు ఇవ్వడం ప్రమాదకరమని డెమొక్రాట్లు హెచ్చరించారు.