యుద్ధంతో అమాంతం పెరిగిన బంగారం, వెండి ధరలు

యుద్ధంతో అమాంతం పెరిగిన బంగారం, వెండి ధరలు
* భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ సూచీలు

ఇరాన్‌ పై అమెరికా- ఇజ్రాయెల్‌ దాడుల అనంతరం బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. పెట్టుబడుల భద్రత కోసం పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మార్కెట్‌ అస్థిరంగా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గత వారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఏకంగా రూ. 9,430 మేర ప్రియం కాగా, 22 క్యారెట్ల బంగారం ధరలో రూ. 8,550 పెరుగుదల నమోదైంది.

వీటి రేట్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. వారం ముగిసేసరికి రికార్డు స్థాయికి చేరుకుంటాయనే అంచనాలు ఉన్నాయి. రూ. 1,75,000 నుండి రూ.1,80,000 వరకు వెళ్లచ్చు. మల్టీ కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3.15 శాతం పెరిగింది. ప్రారంభ ట్రేడింగ్‌ లో రాకెట్‌ లా దూసుకెళ్లింది ఏకంగా రూ. 1,67,217కు చేరింది. ఆ తర్వాత ఇది ఎక్కడా ఆగలేదు. 3.25 శాతానికి ఎగబాకింది. రూ. 1,68,000 వరకూ వెళ్లింది. 

ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో బంగారం రేట్లు పెరగడం ఇదే తొలిసారి. కిలో వెండి ధర కూడా ఒక్కసారిగా జంప్‌ అయింది. 2.92 శాతం మేర పెరుగుదల కనిపించింది ఇందులో. రూ. 2,90,900 నుండి రూ. 2,93,887 వరకు పెరిగింది.

అంతర్జాతీయ కామిక్స్‌ మార్కెట్‌లో స్పాట్‌ బంగారం ధర ఔన్సుకు 5,350 డాలర్ల మార్కును అధిగమించింది. రూ. 5,345.50 నుండి రెండు శాతం మేర పెరుగుదలతో రూ. 5,351.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వెండి ధర కూడా ఔన్సుకు 0.81 నుండి 1.08 శాతం అంటే 94.30 డాలర్ల వరకు పుంజుకుంది. అంతర్జాతీయంగా వీటి రేట్లకు ఏ స్థాయిలో డిమాండ్‌ పెరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

మరోవంక, పశ్చిమాసియా యుద్ధ జ్వాలల్లో భారత్‌ సహా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు మండిపోయాయి. బీఎ్‌సఈలో సోమవారం ట్రేడింగ్‌ ఆరంభంలో 2,743.46 పాయింట్లు (3.37 శాతం) పతనమై 78,543.73 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌.. చివరికి 1,048.34 పాయింట్ల (1.29 శాతం) నష్టంతో 80,238.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 25,000 కీలక మద్దతు స్థాయిని కోల్పోయింది.

 ప్రారంభ ట్రేడింగ్‌లో 575.15 పాయింట్లు (2.28 శాతం) పతనమై 24,600 స్థాయికి జారిన సూచీ.. ట్రేడింగ్‌ నిలిచేసరికి 312.95 పాయింట్ల (1.24 శాతం) నష్టంతో 24,865.70 వద్ద స్థిరపడింది. ఈక్విటీ మార్కెట్‌ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) రూ.6.59 లక్షల కోట్లు తగ్గి రూ.456.90 లక్షల కోట్లకు (5 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.