యుపిలో అన్ని స్కూళ్లు, కాలేజీల్లో వందేమాతరం తప్పనిసరి

యుపిలో అన్ని స్కూళ్లు, కాలేజీల్లో వందేమాతరం తప్పనిసరి
ఉత్తర ప్రదేశ్ లోని అన్ని స్కూళ్ళు, కళాశాలల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేశారు. భారత జాతీయ గేయం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త ఉత్సవాలను ప్రారంభించిన కొద్ది రోజులకే యూపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని గోరఖ్‌పూర్‌లోని ఏక్తా యాత్ర, వందేమాతరం సామూహిక గేయాలాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ప్రకటించారు.
 
ఈ నిర్ణయం దేశం పట్ల గౌరవం, గర్వభావాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిందని తెలిపారు. ప్రతి పౌరుడిలో మాతృభూమి పట్ల గౌరవం నింపడానికి వందేమాతరం ఆలపించడం తప్పనిసరి చేస్తామని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.  “మన చర్చల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను భాగం చేసుకోవాలి. ప్రతి పౌరుడు భారత మాత, మాతృభూమి పట్ల గౌరవ భావంతో నిండి ఉండేలా యుపిలోని అన్ని విద్యాసంస్థల్లో ‘వందేమాతరం’ పారాయణం తప్పనిసరి చేస్తాము” అని స్పష్టం చేశారు.
 
ఈ సందర్భంగా వందేమాతరం గేయాన్ని వ్యతిరేకించే వారిపై యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు చేశారు.  ఇది భారత సమైక్యతను దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. జాతీయ గేయాన్ని వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీపై విమర్శలు చేసిన యోగి ఆదిత్యనాథ్ అలాంటి వ్యక్తులు దేశ సమగ్రతా నిర్మాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని విస్మరించి మహ్మద్ ఆలీ జిన్నాకు గౌరవం ఇచ్చే కార్యక్రమాలకు హాజరవుతున్నారని మండిపడ్డారు.
 
1923లో మహమ్మద్ అలీ జౌహర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పుడు  వందేమాతరం గేయాన్ని వ్యతిరేకించడం వల్లే దురదృష్టవశాత్తూ దేశ విభజనకు కారణమైందని ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. భారతదేశ సమగ్రతను సవాలు చేసే కొత్త జిన్నాలు మళ్లీ పుట్టకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు. అలాంటి విచ్ఛిన్నకర ఉద్దేశాలను మొగ్గలోనే తుంచివేయాలని ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
 
ముహమ్మద్ అలీ జిన్నా భారతదేశంలో మళ్ళీ పుట్టకూడదని, ఒకవేళ జన్మించినా, అతన్ని సమాధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. “జాతీయ గీతం ‘వందేమాతరం’ కు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రతి పాఠశాల, కళాశాలలో బహిరంగంగా పారాయణం చేయాలి, పాడాలి. ఇది అందరికీ అవసరం. జాతీయ ఐక్యత, సమగ్రతను బలహీనపరిచే అంశాలను మనం గుర్తించాలి. భారతదేశ సమగ్రతను సవాలు చేయడానికి భవిష్యత్తులో జిన్నాలు పుట్టకుండా మనం వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. నేటి ఏక్తా యాత్ర విస్తృత ప్రజా అవగాహనకు పిలుపునిస్తోంది” అని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
 
“నేటికి కూడా, భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ దేశానికి విధేయులుగా ఉంటారని, దాని ఐక్యత కోసం కృషి చేస్తారని మేము ఆశిస్తున్నాము. కులం, ప్రాంతం లేదా భాష పేరుతో సమాజాన్ని విభజించే అన్ని అంశాలను గుర్తించి వ్యతిరేకించడం ఇప్పుడు మన కర్తవ్యం. ఈ విభజనలు కొత్త జిన్నాలను సృష్టించే కుట్రలో భాగం” అని ఆయన తెలిపారు.
 

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా బిజెపి మరియు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన వివిధ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వివరించారు. “అక్టోబర్ 30న దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ‘రన్ ఫర్ యూనిటీ’ పేరుతో జాతీయ ఐక్యతా పరుగును నిర్వహించారు. ఈ కాలంలో, బిజెపి కూడా గొప్ప వల్లభాయ్ పటేల్ జీవితం, కృషిపై దృష్టి సారించిన కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించింది” అని తెలిపారు.

 
ఇటువంటి కార్యక్రమాలలో అనేక ప్రభుత్వ స్థాయి కార్యక్రమాలు కూడా ప్రారంభించచామని చెబుతూ అది ‘స్వదేశీ’ గురించి అయినా లేదా స్వావలంబన కార్యక్రమాల గురించి అయినా, దేశవ్యాప్తంగా విస్తృత ప్రజా అవగాహన ప్రచారాలతో పాటు, జాతీయ ఐక్యత సమస్యలను పరిష్కరించే చొరవలను ముందుకు తెచ్చామని  ఆదిత్యనాథ్ చెప్పారు. 
 
రెండు కిలోమీటర్ల ఏకతా యాత్ర గోర్కాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి ప్రారంభమై విశంబర్ పాఠక్ పార్క్ సమీపంలోని గీతా వాటిక వద్ద ముగిసింది. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మేంద్ర సింగ్ సహా సీనియర్ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు.