భారతీయతను ట్రినిడాడ్ కు తీసుకొచ్చారు

భారతీయతను ట్రినిడాడ్ కు తీసుకొచ్చారు
ట్రినిడాడ్ అండ్ టోబాగోలో భారతీయ సమూహాన్ని ధైర్యానికి ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. వారి పూర్వీకులు ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను గుర్తు చేశారు. బ్రిటిష్ పాలనలో బిహార్ నుంచి గిర్మిత్ కూలీలుగా వివిధ దేశాలకు తరలించబడ్డ భారతీయుల (గిర్మితియాలు) ప్రయాణాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు.  బ్రిటిష్ ఇండియా నుంచి బానిసత్వ విధానంలో విదేశాల్లోని తోటలలో కూలీగా పనిచేయించేందుకు పంపిన కార్మికులనే గిర్మితియాలు అంటారు.
గురువారం కౌవాలోని నేషనల్ సైక్లింగ్ వెలోడ్రోమ్‌లో భారతీయ సమూహంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోదీ మనమంతా ఒకే కుటుంబంలో భాగమని చెప్పారు. ట్రినిడాడ్ అండ్ టోబాగోలో సుమారు 13 లక్షల జనాభా ఉంటే అందులో 45 శాతం మంది భారతీయ మూలాలున్న ఉన్నవారే అని చెప్పారు. “మీ పూర్వీకులు గంగా, యమునా తీరాలను విడిచిపెట్టినా, రామాయణాన్ని హృదయంలో మోస్తూనే వచ్చారు.  వారు సమస్యలను పట్టుదలతో ఎదుర్కొన్నారు. ఈ భూమిలోకి భారతీయ నాగరికతను తీసుకొచ్చారు” అని తెలిపారు.

ట్రినిడాడ్ అండ్ టోబాగో అభివృద్ధిలో సాంస్కృతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల్లో నాటి నుంచి భారతీయ సమాజం ఎనలేని సేవలను అందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తింపు పొందిన ట్రినిడాడ్ మాజీ ప్రధాని కమలా పర్సాద్ బిసెసర్‌ను మోదీ గుర్తు చేశారు. ఆమెను బిహార్ కుమార్తె అభివర్ణించారు. ఆమె పూర్వీకులు బిహార్‌లోని బక్సర్ జిల్లాకు చెందినవారని పేర్కొన్నారు. 

“ట్రినిడాడ్ మాజీ ప్రధాని కమలా పర్సాద్ బిసెసర్ పూర్వీకులు బిహార్‌లోని బక్సర్‌కు చెందినవారు. ఆమె స్వయంగా 2012లో తన తాతముత్తాతల ఊరు బిహారులోని భేలుపూర్‌ను సందర్శించారు. బిహారీ ప్రజలు ఆమెను తమ కుమార్తెగా భావిస్తారు” అని మోదీ చెప్పారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఉన్నదని మోదీ ఈ సందర్బంగా వివరించారు. “త్వరలోనే మన దేశం ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక శక్తుల్లో ఒకటవుతుంది. ఈ అభివృద్ధి ప్రపంచానికి ప్రయోజనకరంగా ఉండేలా మేం కృషి చేస్తున్నాం. భారత్ ఈరోజు అవకాశాల దేశంగా మారింది” అని ఆయన పేర్కొన్నారు. 

ప్రతి ప్రవాసుడు భారత్​కు దూతగా భావించాలని చెబుతూ “మీరు భారతదేశపు సాంస్కృతిక విలువలను, సంప్రదాయానికి ప్రతీకలు. మీరు మన దేశ గర్వకారణం” అని మోదీ చెప్పారు. 1999 తర్వాత ట్రినిడాడ్ ను భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ట్రినిడాడ్ అండ్ టోబాగో పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం గమనార్హం.

ట్రినిడాడ్ అండ్ టోబాగోలో భారతీయ మూలాలు కలిగిన వ్యక్తుల్లో ఆరో తరం వరకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులు జారీ చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఓసీఐ కార్డుతో వారికి భారత్‌లో ఉద్యోగం, విద్య, ఆస్తి కొనుగోలు వంటి అంశాల్లో లభించనున్నట్లు తెలిపారు. 

“మీరందరూ కేవలం రక్త సంబంధాలతో కాక, మాతృభూమిపై అనుభూతితో మాతో అనుసంధానమయ్యారు. భారత్ మిమ్మల్ని స్వాగతిస్తోంది. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది” అని ప్రధాని మోదీ అని మోదీ ప్రవాసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “భారత్​కు వచ్చి మీ పూర్వీకుల ఊళ్లను సందర్శించండి. మీ పిల్లలు, మిత్రులు, చాయ్‌ను ఇష్టపడే ఎవరినైనా తీసుకురండి” అని మోదీ కోరారు. 

ఆధునిక డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యుపిఐకి అనుమతిచ్చిన కరిబియన్ దేశాల్లో ట్రినిడాడ్ మొదటి దేశంగా నిలిచినందుకు మోదీ అభినందనలు తెలిపారు. యూపీఐ ద్వారా పేమెంట్ చేయడం చాలా ఈజీ అన్నారు. గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపినంత ఈజీగా చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ లావాదేవీల వేగాన్ని వెస్టిండీస్ బౌలింగ్​తో మోదీ పోల్చడం గమనార్హం. భారత్ అంతరిక్ష ప్రయోగాలను కూడా మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 “చంద్రయాన్-3 చంద్రునిపై దిగినప్పుడు మీరు ఆనందించినట్టే. ఆ ల్యాండింగ్ స్థలానికి మేము శివశక్తి పాయింట్ అని పేరు పెట్టాం. ఇప్పుడు ఓ భారతీయ ఖగోళ యాత్రికుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉన్నారు. త్వరలో ‘గగన్‌యాన్’ మిషన్ ద్వారా మనదేశపు ఖగోళయాత్రికుడు చంద్రునిపై అడుగుపెడతాడు. మన విజయాలను ప్రపంచంతో పంచుకుంటాం. నక్షత్రాలను లెక్కపెట్టడం కాదు, వాటిని చేరడం మన లక్ష్యం” అని మోదీ పేర్కొన్నారు.