
వాస్తవానికి జూన్ 10నే రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ 56 ఏళ్ల వాద్రా తనకు జూన్ 9న ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నాయని, ప్రోటోకాల్ ప్రకారం కరోనా టెస్ట్ చేయించుకున్నానని చెప్పి, గైర్హాజరు అయ్యారు. అయితే వాద్రాకు ఈడీ సమన్లు తప్పించుకునే ఉద్దేశం లేదని, ఈ నెల చివర్లో తన విదేశీ ప్రయాణానికి ముందుగానీ లేదా తరువాత ఎప్పుడైనా కానీ ఈడీ ముందు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది అప్పట్లో చెప్పారు.
అయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (పీఎంఎల్ఏ) కింద తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి, తర్వాత ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి రాబర్ట్ వాద్రాకు ఈడీ తాజా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాబర్ట్ వాద్రాను ఈడీ 3 మనీ లాండరింగ్ కేసుల్లో విచారణ చేస్తోంది. మొదటగా, హరియాణాలో 2008లో జరిగిన ఓ భూ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ మనీలాండరింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విషయంగా ఈడీ రాబర్ట్ వాద్రాను 3 రోజులపాటు ప్రశ్నించింది.
రెండో కేసులో, రాజస్థాన్లోని బికనీర్లో జరిగిన ఓ భూ ఒప్పందంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ మనీలాండరింగ్ కేసులోనూ రాబర్ట్ వాద్రాపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. మూడో కేసులో 2016లో ఢిల్లీలో ఉన్న సంజయ్ భండారీ (63)పై ఆదాయపు పన్ను శాఖ రైడింగ్ చేసింది. ఇది జరిగిన వెంటనే అతను లండన్ పారిపోయాడు. అతనిని తిరిగి భారత్కు తీసుకువచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుకూ ఈ నెల ప్రారంభంలో బ్రిటన్ సుప్రీంకోర్ట్లో భారత్ ప్రభుత్వం అప్పీల్ చేసింది. అయితే దానిని యూకే కోర్ట్ తిరస్కరించింది. దీనితో భండారీని మన దేశానికి తీసుకువచ్చే అవకాశాలు దాదాపుగా లేకుండా పోయాయి.
2009లో లండన్లోని 12, బ్రయాన్స్టన్ స్క్వేర్ ఇండిని భండారీ కొనుగోలు చేశాడు. అయితే దానిని రెనోవేషన్ చేయమని ఆదేశిస్తూ రాబర్ట్ వాద్రా నిధులు అందించినట్లు ఈడీ 2023లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే తనకు ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగా గానీ లండన్లో ఎలాంటి ఆస్తులు లేవని రాబర్ట్ వాద్రా అంటున్నారు. తనపై ‘రాజకీయ కక్ష’లతోనే ఇలా ఈడీ కేసులు పెట్టి ‘వెంటాడి, వేధిస్తున్నారు’ అని అన్నారు.
More Stories
భారత్కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
ఎల్ఐసీలో 1 శాతం వాటా విక్రయం