నాగారంలో భూదాన్‌ భూముల స్వాహాకు కుట్ర

నాగారంలో భూదాన్‌ భూముల స్వాహాకు కుట్ర
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్‌ భూముల స్వాహాకు కబ్జాదారులు కుట్ర పన్నినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తేల్చింది. అధికారుల అండతో సర్వే నం.181, 182కు సంబంధించి భూముల స్వాహాకు యత్నించినట్టు దర్యాప్తులో తేలిందని ఈడీ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌లో పేరొంది. నాగారంలోని సర్వే నం.181, 182, 194, 195ల్లో భూదాన్‌ భూముల్లో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 

ఉన్నతాధికారులకు ఫిబ్రవరి, మార్చిల్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లేశ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్‌ సీవీ భాసర్‌రెడ్డి, ఈడీతోపాటు పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, వారి బంధువులకు నోటీసులు జారీ చేశారు. 

కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించడంతో ఈడీ తరపున అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గజరాజ్‌సింగ్‌ ఠాకూర్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. 2023 మార్చి 13న మహేశ్వరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని ఈడీ వివరించింది.

దర్యాప్తులో సర్వే నం. 181, 182లోని 103 ఎకరాలు నవాబ్‌ హాజీఅలీఖాన్‌కు చెందినది కాగా, తన కుమారులైన ఫరూక్‌ అలీఖాన్‌, అక్బర్‌ అలీఖాన్‌లకు కానుకగా కొంత ఇవ్వగా 50 ఎకరాలు భూదాన్‌ బోర్డుకు ఇచ్చారని తెలిపింది. అయితే నవాబ్‌ కుమార్తె ఖాదరున్నీసా, ఆమె కుమారుడు మునావర్‌ ఖాన్‌తోపాటు మహమ్మద్‌ అబ్దుల్‌ రెహమాన్‌, మహమ్మద్‌ అబ్దుల్‌ అఖ్తర్‌, మహమ్మద్‌ అబ్దుల్‌ షుకూర్‌, ఎం చంద్రయ్య తదితరులు కుట్రకు తెరతీసినట్టు తెలిపింది. 

నవాబుకు ఇద్దరు కుమారులు ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నప్పటికీ తాను ఒకరే వారసురాలుగా ఆమె సమర్పించిన అఫిడవిట్‌ను ఎమ్మార్వో పరిగణనలోకి తీసుకొని ధరణిలో నమోదు చేశారన్నారని పేర్కొంది. వీరందరూ కలిసి 2017లో భూదాన్‌ యజ్ఞ బోర్డు డీనోటిఫై చేసినట్టు నకిలీ, ఫోర్జరీ లేఖను సృష్టించి అధికారులకు సమర్పించారు. 

వాస్తవంగా ఇది భూదాన్‌ భూమిగా రికార్డుల్లో ఉన్నప్పటికీ కుట్రలో భాగంగా అధికారులు డీనోటిఫై చేశారు. 1956లో నవాబ్‌ హాజీఅలీఖాన్‌ 50 ఎకరాలను భూదాన్‌ బోర్డుకు ఇచ్చే లేఖను తహసీల్దార్‌కు అప్పగించారు. దీన్ని తహసీల్దార్‌ ఆమోదించి 1995లో నిషేధిత జాబితాలో చేర్చారు. సర్వే నం.81లో మిగిలిన భూమిని గైరాన్‌ సరారి భూములుగా ప్రభుత్వం ప్రకటించింది.

నవాబ్‌ హాజీఅలీఖాన్‌ 57 ఎకరాలను సర్వే నం.181/1, 2, 3, 5, 6, 182లో అక్బర్‌ అలీఖాన్‌, ఫరూఖ్‌ అలీఖాన్‌కు 1967-68లో మౌఖికంగా కానుకగా ఇవ్వగా, భూసంసరణల ట్రిబ్యునల్‌ దీన్ని ఆమోదించింది. ఈ భూమిని నవాబు కుమారులు 2005లో దస్తగిరి షరీఫ్‌కు, ముజాఫర్‌ హుస్సేన్‌కు విక్రయించారు. 

2006లో నవాబ్‌ మృతి చెందారు. ఆ తర్వాత తొమ్మిది ఏండ్లకు ఒకసారిగా సర్వే నం.181, 182లో భూమిని తండ్రి కానుకగా ఇచ్చారంటూ తప్పుడు పార్టిషన్‌ అగ్రిమెంట్‌ డాక్యుమెంట్‌ పొందారు. దీన్ని ఆమోదించిన అధికారులు వారసత్వ, పాస్‌బుక్‌ జారీచేశారు. మ్యుటేషన్‌ కూడా కావడంతో ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేశారు. నకిలీ పత్రాలను సమర్పించిన ప్రైవేటు వ్యక్తులతో ప్రభుత్వ అధికారులు కుమ్మకై డీనోటిఫై చేశారు.

దస్తగిరి షరీఫ్‌ ప్రైవేట్‌ ఫిర్యాదు ఆధారంగా మహేశ్వరం పోలీసులు 2023 మార్చి 13న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఖాదరున్నీసా, మహమ్మద్‌ మునావర్‌ఖాన్‌, బొబ్బిలి దామోదర్‌రెడ్డి, బొబ్బిలి విశ్వనాథరెడ్డి, ఎన్‌ సంతోష్‌కుమార్‌, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి మోసపూరితంగా భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని కేసు నమోదైంది. గత మండల రిజిస్ట్రార్‌ ఆర్పీ జ్యోతి సహకారంతో విక్రయాలు చేశారని ఫిర్యాదుదారు పేరొన్నారు.