అధిష్ఠానం రూపొందించిన నివేదిక అంటూ మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేసిన కొన్ని ప్రతుల పట్ల తెలంగాణ మంత్రులు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పనితీరుపై నివేదిక ఇవ్వలేదా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల సమావేశంలో దీన్ని అధిష్ఠానం ప్రగతి నివేదికగా పేర్కొన్నదని, ఇప్పటి వరకు ఆయా శాఖల్లో మంత్రుల పనితీరు, ప్రజలతో మమేకమైన తీరు, అంతిమంగా వారి వలన పార్టీకి ఒనగూరిన లాభం, జరిగిన నష్టం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ, బీ, సీ,డీ గ్రేడ్లు ఇచ్చినట్టు మంత్రులకు సీఎం వివరించినట్టు తెలిసింది.
అధిష్ఠానం మంత్రులకు మాత్రమే గ్రేడింగ్ ఇచ్చిందా? మీకు ఇవ్వలేదా? అని మంత్రులు నిలదీసినట్టు సమాచారం. రోజు రోజుకు ఎమ్మెల్యేల మద్దతు తగ్గుతున్న మీకు అధిష్ఠానం ఎలాంటి గ్రేడింగ్ ఇచ్చిందని వ్యంగ్యాస్త్రం సంధించినట్టు తెలిసింది. మొదట్లో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సంపూర్ణంగా మద్దతు ఇచ్చే 19 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు 15కు పడిపోయిందని అంటున్నారని, అధిష్ఠానం మీ పనితనం కూడా పరిగణలోకి తీసుకుని ఉంటుంది గదా? మీ రిపోర్టు కూడా ఇక్కడ పెట్టండని గట్టిగా నిలదీసినట్టు సమాచారం.
ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రికి, దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రికి డీ గ్రేడ్లు, దక్షిణ తెలంగాణ జిల్లాకే చెందిన మరో మంత్రికి ‘సీ గ్రేడ్ వచ్చిందని ఫలితాలను మంత్రుల ముందు పెట్టినట్టు సమాచా రం. సీఎంకు కొంత సమీపంగా ఉండే ఇద్దరు మంత్రులకు మినహా మిగిలిన మంత్రి వర్గం అంతా బీ,సీ,డీ గ్రేడ్లలోనే ఉన్నట్టు తెలిసింది. మంత్రుల పనితీరుపై అధిష్టానం దృష్టిసారించిందని సీఎం వారికి చెప్పినట్టు తెలిసింది.
ఏ పథకం సక్కగ అమలు చేశామని ప్రజలకు చెప్పుకుంటూ తిరగాలని మంత్రులు ఎదురు తిరిగినట్టు తెలిసింది. మనం ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా యువత కోసం పథకం తీసుకొస్తే, దాన్ని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని మంత్రి ఒకరు నిలదీసినట్టు తెలిసింది. యువతకు ఉపాధి చూపించకుండా స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్లగలమని నిలదీసినట్టు సమాచారం.
డీ గ్రేడ్ వచ్చిన మంత్రి సభలోనే కన్నీళ్లు పెట్టినట్టు తెలిసింది. ఈ 17 నెలల కాలం నుంచి తనను సుఖంగా ఉండనియ్యలేదని, ఏదో ఒక ఆరోపణతో తనను పలుచన చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం.
‘అరకొర రుణమాఫీ, ఆగిన రైతుభరోసా పెట్టుబడి సాయం, ఎక్కడి ధాన్యం అక్కడే, మళ్లీ ఎరువుల కొరత, విత్తనాల కొరత ఇలా ప్రతి అంశంలోనూ రైతులు మళ్లీ గోస పడుతున్నారు. దీనికి మనమే కారణమనే అభిప్రాయంతో రైతులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జనం వద్దకు పోయి ఏం చెప్పమంటారు’ అని సీనియర్ మంత్రి ఒకరు నిలదీసినట్టు తెలిసింది.
రైతు భరోసా పథకాన్ని మూడు ఎకరాల వరకు ఇచ్చి పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేశామని, ఈ పథకం కింద యాసంగి సీజన్కు రూ. 9,300 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ. 5 వేల కోట్లు కూడా పంచలేకపోయామని ఆ మంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. రైతుబీమా, విత్తనాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాలేదని లెక్కలు చెప్పినట్టు సమాచారం. రైతు పథకాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని సీ ఎంను గట్టిగానే నిలదీసినట్టు తెలిసింది.
More Stories
ఎమర్జెన్సీ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి
నకిలీ ఆధార్ కార్డుల తయారీలో బెంగాల్ లో నలుగురు అరెస్ట్
29 మంది సినీ సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు