
* టెల్ అవీన్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం
ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే లక్ష్యంగా రెండ్రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులు మూడోరోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరుదేశాలు పరస్పరం భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. టెహ్రాన్ నగరం పేలుళ్ల శబ్దాలతో దద్ధరిల్లింది. ఇరు దేశాల మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకర దాడులు చోటుచేసుకున్నాయి. మూడో రోజు ఇరాన్ ఇంధన పరిశ్రమ, రక్షణ కార్యాలయం లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడ్డాయి.
మరోవంక, ఇజ్రాయెల్పై అత్యాధునిక క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆదివారం జరిపిన క్షిపణి దాడిలో హజ్ ఖాస్సీం గైడెడ్ బాలిస్టిక్ మిసైల్ను వినియోగించినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సమర్థవంతంగా తిప్పికొడుతున్నది. క్షిపణులు, డ్రోన్లతో ఆ దేశంపై విరుచుకుపడుతున్నది. దీంతో జెరూసలేం, టెల్ అవీవ్లో అంతటా వైమానిక దాడి సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలను, ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తికి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇరాన్ రక్షణమంత్రి అజిజ్ నసీర్జాదా మే 4న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమవద్ద సరికొత్త బాలిస్టిక్ మిసైల్ సిద్ధమైనట్లు ప్రకటించారు.
అది అమెరికా థాడ్, పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించగలదని, ఈ సరికొత్త క్షిపణి రేంజ్ 1200 కిలోమీటర్లు అని ఇరాన్ పేర్కొంది. దీని వార్ హెడ్ తన గమనాన్ని మార్చుకోగలదని అందుకే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదిస్తుందని వెల్లడించింది. దీనికి ఖుద్స్ ఫోర్స్ జనరల్ ఖాసిం సులేమానీ పేరు పెట్టినట్లు తెలిపింది. అయన చెప్పినట్లుగా ఇజాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ డోమ్ ను చీల్చుకుని ఇజ్రాయెల్ భూభాగంలో పలు ప్రాంతాలలో ఈ క్షిపణులు విధ్వంసం సృష్టించాయి..
దాడులలో అమెరికా హస్తం
ఈ దాడుల వెనుక అమెరికా హస్తం ఉందని ఇరాన్ ఆరోపించింది. న్యూక్లియర్ ఒప్పందాలు చేసుకోవడాన్ని నిరాకరించడం వల్ల తమపై ఇజ్రాయెల్ తో దాడులు సాగిస్తోందని ధ్వజమెత్తింది. అమెరికా సైతం తమ ప్రతీకార దాడులను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇరాన్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇరాన్ తమ ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు.
అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరించడం పట్ల ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ దేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే అమెరికా సాయుధ దళాల పూర్తిస్థాయిలో ఇరాన్ పై యుద్ధానికి దిగుతాయని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో ఇరాన్ పై యుద్దానికి దిగుతామని హెచ్చరించారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిలో తమ ప్రమేయం లేదని పేర్కొంటూ అమెరికాపై ఇరాన్ దాడికి పాల్పడితే దాని పర్యవసానంగా తీవ్రంగా ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందాలను సులభంగా ఖరారు చేసుకోవచ్చని హితవు చెప్పారు. అంతే గానీ ఈ ఘర్షణల మధ్య తమను లాగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్-అమెరికా మధ్య ఒమన్లో నేడు జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. దీంతో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మొదలైన దాడులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించటం లేదు.
More Stories
భారత్కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!