పధకం ప్రకారమే ప్రభాకర్ రావు లొంగుబాటు

పధకం ప్రకారమే ప్రభాకర్ రావు లొంగుబాటు

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మామూలోడు కాదని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రభాకర్ రావు తమ వంటి  అనేక మంది కార్యకర్తల ఉసురుపోసుకున్నాడని పేర్కొంటూ అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సెలింగ్ తంతు పూర్తయ్యిందని, పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారని తెలిపారు.

విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ను బహిరంగ పర్చాలని, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిపైనే కాదు, తనతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన ఘనుడని పేర్కొన్నారు.  ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనమయ్యాయని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలను కూడా ట్యాప్ చేసిన నీచుడని, ఆయన వల్ల భార్యాభర్తలు ఫోన్ లో మాట్లాడుకోలేని దుస్థితిని కల్పించారని చెబుతూ ఎవరి ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాలని సంజయ్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు? ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పంపారు? ఆ ఆడియోలను అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారు?

 కోర్టు నిబంధనలకు లోబడే ప్రభాకర్ రావుపై సీరియస్ గా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందని, 18 నెలల పాలనలో ఏ ఒక్క అవినీతి కేసులో విచారణ కూడా ముందుకు సాగలేదని ఆయన ధ్వజమెత్తారు. ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు వినిపించాలని, ప్రభాకర్ రావుతో సహా ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందేని ఆయన స్పష్టం చేశారు.