11 ఏళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్

11 ఏళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్
ఎన్డీఏ 11 ఏళ్ల పాలనలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వాతావరణ మార్పులు, డిజిటల్‌ ఇన్నోవేషన్‌ వంటి రంగాల్లో ప్రపంచ గళంగానూ మారిందని పేర్కొన్నారు. తన నేతృత్వంలోని మూడో విడత ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

సుపరిపాలన, పరివర్తనపై పూర్తి స్థాయిలో దృష్టిసారించామని ప్రధాని మోదీ తెలిపారు. సామాజిక న్యాయానికి సైతం అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు గుర్తు చేసిన ప్రధాని మోదీ, తమ మంత్రి మండలిలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారే ఉన్నట్లు తెలిపారు. ఈ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు మంత్రి పదవులు కేటాయించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. 

ఎన్డీఏ 11 ఏళ్ల ప్రస్థానంలో ఆర్థిక వృద్ధి నుంచి సామాజిక అభ్యున్నతి వరకూ ప్రజల కేంద్రంగానే పాలన సాగించినట్లు మోదీ వివరించారు. వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధన దిశగా తాము ముందుకుసాగుతున్నట్లు వెల్లడించారు.

మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల పాల ప్రజాసేవ పట్ల సంకల్పం, కృషి, అంకిత భావాలకు ఒక ‘స్వర్ణయుగం’ అని కేంద్ర హోంమంత్రి అమిత్షా అభివర్ణించారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ పాలనలో భారత్ అభివృద్ధి, స్వావంలన వైపు వేగంగా పురోగమిస్తోందని ఆయన తెలిపారు. దేశ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం ద్వారా భారతదేశాన్ని ప్రతి రంగంలోనూ నంబర్-1గా మార్చే ప్రయాణం కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. 

 
“నాయకత్వం స్పష్టంగా ఉన్నప్పడు, సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు- సేవ, భద్రత, సుపరిపాలనలో కొత్త రికార్డులు సృష్టించబడతాని మోదీ ప్రభుత్వం నిరూపించింది” అని అమిత్షా పేర్కొన్నారు.

‘2014లో ప్రధానిగా మోదీ దేశ పగ్గాలు చేపట్టినప్పుడు భారత్ విధానపరంగా అచేతనంగా ఉంది. గత ప్రభుత్వాలకు విధానాలు లేవు, నాయకత్వం లేదు. మోసాలు తారస్థాయికి చెరుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. పాలనా వ్యవస్థ దిశానిర్దేశం లేకుండా ఉండేది. కానీ గత 11 ఏళ్లలో ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన’ ద్వారా దేశ అభివృద్ధి వేగం, స్థాయి రెండూ మారాయి” అని అమిత్ షా తెలిపారు.

“మోదీ రైతులు, మహిళలు, వెనుకబడినవారు, దళితులు, అణగారిన వర్గాలను పాలనలో భాగం చేశారు. బుజ్జగింపులకు బదులుగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే పని సంస్కృతిని సృష్టించారు” అని అమిత్ షా పేర్కొన్నారు.

“‘మోదీ జాతీయ భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలో నక్సలిజం చివరి దశలో ఉంది. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. భారత్ ఇప్పుడు ఉగ్రవాదుల స్థావరాల్లోకి చొరబడి వారిని అంతమొందిస్తోంది. ఇది మోదీ ప్రభుత్వ హయాంలో మారుతున్న భారత చిత్రాన్ని చూపిస్తుంది” అని అమిత్ షా వివరించారు.

చరిత్రలో సువర్ణాక్షరాలతో

సుపరిపాలన, పేదల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించపడుతుందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్‌, వక్ఫ్ సవరణ బిల్లు, మహిళా బిల్లు, పెద్ద నోట్ల రద్దు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలని ఆయన చెప్పారు.  కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లైనా సందర్భంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులు గురించి నడ్డా వివరించారు.

సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రంతో గత 11 ఏళ్లుగా ముందుకు సాగుతున్నామని నడ్డా తెలిపారు.  2014లో తాము అధికారంలో చేపట్టినప్పుడు భారత్ ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా, ప్రధాని మోదీ దార్శనికతతో ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. ఇక నుంచి ఉగ్ర దాడులను యుద్ధంగానే భావిస్తామని , ఈ విషయాన్ని ప్రధాని ఇప్పటికే పలుమార్లు చెప్పారని నడ్డా గుర్తు చేశారు. 

రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతరాహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆయన, దేవుడు ఆయనకు కాస్త బుద్దిని ప్రసాదించాలని కోరారు. ఆపరేషన్ సిందూర్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌పై రాహుల్ ఆరోపణల నేపథ్యంలో నడ్డా ఈ మేరకు స్పందించారు.