
ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించకపోవడం వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని మాజీ మంత్రి హరీశ్రావు చెప్పారు. ఆ ప్రాజెక్టును ఏడు లింకులుగా ప్రతిపాదించగా ఆరు లింకులను కాళేశ్వరంలో యథాతథంగా ఉంచామని, ఒకదాన్ని మాత్రమే మార్చామని తెలిపారు.
సోమవారం ఆయన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంతో పాటు ఆధారాలను సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ)లో చిక్కుముళ్లు, నిర్మాణ సమస్యల తర్వాతే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ జరిపామని తెలిపారు. ఇందుకోసం తాను చైర్మన్గా, నాటి మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులతోనే ప్రాణహిత- చేవెళ్లను రీ ఇంజనీరింగ్ చేశామని పేర్కొన్నారు. ప్రాణహిత -చేవెళ్లను రెండు ప్రాజెక్టులుగా విడగొట్టామని, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి, ఉమ్మడి ఆదిలాబాద్లో నీరందించడానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహితగా, మరొకటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా చేపట్టామని తెలిపారు.
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడంతోనే మేడిగడ్డకు బ్యారేజీ స్థలాన్ని మార్చామని చెప్పారు. 152 అడుగుల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర అంగీకరించలేదని హరీశ్రావు తెలిపారు. ముంపునకు గురయ్యే ప్రాంతానికి పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామంటూ అప్పటి మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హసన్ ముష్రీ్ఫను 2014 ఆగస్టు 23న కలిశానని తెలిపారు.
152 అడుగుల ఎత్తుతో బ్యారేజీని అంగీకరించబోమని మహారాష్ట్ర నాటి సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. 2007 నుంచి 2014 దాకా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నా అనుమతులు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేవేంద్ర ఫడణవీ్సతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారని చెప్పారు.
‘నేనే ప్రాణహిత-చేవెళ్ల ముంపునకు వ్యతిరేకంగా ఉద్యమించా. అలాంటి నేనే అనుమతులు ఎలా ఇస్తా?’ అని ఫడణవీస్ పేర్కొన్నారని తెలిపారు. ఇక తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉండగా అందులో 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా అని సీడబ్ల్యూసీ 2015 మార్చి 4న లేఖ రాసిందని తెలిపారు. మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ లేఖతో రీ ఇంజనీరింగ్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం ఉందా అని కమిషన్ ప్రశ్నించగా ఉందని, ప్రతి కాంపొనెంట్కు మంత్రివర్గ తీర్మానం కూడా ఉందని హరీశ్రావు జవాబు ఇచ్చారు. బ్యారేజీల స్థలాల మార్పు నిర్ణయం హైపవర్ కమిటీ తీసుకుందా? వ్యాప్కోస్ లేఖ తర్వాత హై పవర్ కమిటీతో సమావేశం జరిగిందా? అని కమిషన్ ప్రశ్నించగా హైపవర్ కమిటీ పూర్తిగా సాంకేతిక కమిటీ అని, బ్యారేజీల స్థలాల మార్పుపై ఆ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు.
తాము ప్రజాప్రతినిధులమని, సాంకేతిక అంశాలపై తమకు సంపూర్ణ అవగాహన ఉండదని బదులిచ్చారు. ప్రాజెక్టులు ప్రతిపాదించిన తర్వాత కూడా నిర్మాణ స్థలాలను మార్చారని, నాగార్జునసాగర్ను తొలుత ఏలేశ్వరం వద్ద కట్టాలని ప్రతిపాదించారని, ఆ తర్వాత నందికొండకు మార్చారని, అదే విధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును తొలుత కుస్తాపురం వద్ద ప్రతిపాదించగా ఆ తర్వాత పోచంపాడుకు మార్చారని, రిజర్వాయర్లు ప్రతిపాదించిన తర్వాత మార్చిన దాఖలాలు పలు ప్రాజెక్టుల్లో ఉన్నాయని హరీశ్ గుర్తుచేశారు.
More Stories
యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో ఏకాకిగా ఇరాన్
స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు