షకీల్‌ అఫ్రిదీని పాక్ విడుదల చేయాలి

షకీల్‌ అఫ్రిదీని పాక్ విడుదల చేయాలి

సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీకి సహాయం చేసిన డాక్టర్‌ షకీల్‌ అఫ్రీదీపై పాకిస్థాన్‌ కఠిన చర్యలు తీసుకోవడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రపంచంలోనే కరుడుగట్టిన ఉగ్రవాది, అల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్‌లాడెన్ను పట్టించడంలో సహాయం చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాడన్ని తీవ్రంగా ఖండించారు.షకీల్‌ అఫ్రిదీని విడుదల చేయాలని పాకిస్థాన్‌ నాయకత్వాన్నీ ఆయన కోరారు.

లాడెన్ ఎక్కడ ఉన్నాడన్న సమాచారాన్ని లీక్‌ చేశాడన్న కారణంతో వైద్యుడిని అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా చిత్రహింసలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే అవార్డులు, రివార్డులు ఇచ్చేవారేమో అంటూ పాకిస్థాన్ వైఖరిని ఎద్దేవా చేశారు.  తక్షణమే షకీల్‌ అఫ్రీదిని విడుదల చేయాలంటూ అమెరికా చట్టసభ సభ్యుడు బ్రాడ్‌ షెర్మన్‌ చేసిన డిమాండ్‌ సరియైనదేనని అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే జరిగితే 9/11 నాటి ముంబయి ఉగ్రదాడుల బాధితులకు న్యాయం జరగడంలో కీలక ముందడుగు పడినట్లవుతుందని శశిథరూర్ పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సైన్యాధ్యక్షుడిగా ఉన్న జనరల్‌ ఆసిం మునీర్‌కు దేశంలో అత్యున్నత సైనిక హోదా కలిగిన ఫీల్డ్‌ మార్షల్‌గా పాక్‌ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగోన్నతి కల్పించింది. ఇప్పుడు ఆ విషయాన్ని పరోక్షంగా దుయ్యబట్టారు శశిథరూర్. శశిథరూర్‌ నేతృత్వంలోని అఖిలపక్ష కమిటీ ఆపరేషన్‌ సిందూర్‌ గురించి అమెరికా వెళ్లిన  సమయంలో బ్రాడ్‌ షెర్మన్‌ పాకిస్థాన్‌ వైద్యుడి ప్రస్తావన తీసుకు రాగా, శశిథరూర్ పోస్ట్ పెట్టారు.

పాకిస్థాన్ కు చెందిన వైద్యుడు అఫ్రీదీ, లాడెన్‌ కుటుంబసభ్యులకు సంబంధించిన డీఎన్‌ఏ నమూనాలను సేకరించేందుకు సీఐఏ పోలియో టీకా కార్యక్రమాన్ని నిర్వహించడానికి సాయం చేశారు. అప్పుడు 2011లో అబొట్టాబాద్‌ మిలిటరీ కంటోన్మెంట్‌ శివార్లలో ఉన్న లాడెన్‌పై అమెరికా దాడి చేసి హతమార్చింది. అది అఫ్రీదీ వల్లనేనని భావించిన పాక్‌ అధికారులు, ఆయనను అరెస్టు చేశారు. 2012లో అక్కడి కోర్టు ఆయనకు 33 ఏళ్లు జైలు శిక్ష విధించిగా, అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్నారు.